బుల్దానా : మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తున్నది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. గ్రామంలో 700 జనాభా ఉంది. ఈ నెల ప్రారంభంలో స్థానికులకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చింది.
అనంతరం కొద్ది రోజుల తరువాత నిర్వహించిన రెండో విడత పరీక్షల్లో 78 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వైరస్ బారినపడిన వారిలో ఎక్కువ మంది ఇటీవల గ్రామంలో నిర్వహించిన పండుగకు హాజరైన వారేనని అధికారులు పేర్కొన్నారు.
పండుగకే హాజరైన ఓ వ్యక్తి ఖమ్గాన్ గ్రామంలో కరోనాతో మృతి చెందాడు. దీంతో అధికారులకు అనుమానం వచ్చి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించగా కేసులు వెలుగు చూశాయి.
పండుగకు చాలా మంది హాజరైనట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్ష చేస్తున్నారు.
లక్షణాలున్న వారిని వెంటనే కొవిడ్ చికిత్స కేంద్రాలకు తరలిస్తున్నారు. లక్షణాలు కనిపించని వారిని ఇంట్లోనే హోం ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి