మాదాపూర్, జూన్ 12 : రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, రాబోయే రెండేండ్లలో వైద్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. టీఏఎన్ఏ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సుమారు రూ.7 కోట్లతో అందజేసిన 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను శనివారం మాదాపూర్లోని అలేఖ్య హోంలో సీఈవో శ్రీనాథ్, నటుడు శ్రీనివాస్రెడ్డి, సుబ్బారావులతో కలిసి మంత్రి పువ్వాడ పలువురికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, మూడో దశ వచ్చినా నియంత్రించే చర్యలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న అనేకమందికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా నియంత్రణకు నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేతో చాలావరకు కేసులు తగ్గాయన్నారు. తానా సేవలు మరువలేనివని, గత రెండు నెలలుగా ఎనలేని సేవలు అందిస్తున్నదని మంత్రి కొనియాడారు.
ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, అలేఖ్య హోమ్స్ డైరెక్టర్ కుర్రా మహేష్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి వంటి వారు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సేవలు అందిస్తున్నట్లు అలేఖ్య హోమ్స్ సీఈవో శ్రీనాథ్ చెప్పారు. 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఆర్థికంగా ఇబ్బందిపడుతూ చికిత్స పొందుతున్న వారికి అందజేస్తామని పేర్కొన్నారు.