వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఓ భారతీయ సంతతి వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలోని సుమారు 1200 మంది యూజర్ అకౌంట్లను డిలీట్ చేసిన కేసులో కోర్టు ఆ తీర్పునిచ్చింది. 2021, జనవరి 11వ తేదీన అమెరికా పోలీసులు దీపాన్షు ఖేర్ను అరెస్టు చేశారు. ఆ వెన్నుపోటు కంపెనీకి నష్టాన్ని మిగిల్చినట్లు అటార్నీ ర్యాండీ గ్రాస్మ్యాన్ తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్షతోనే.. దీపాన్షు చాలా ఆధునిక రీతిలో కంపెనీపై సైబర్ దాడి చేసినట్లు జిల్లా కోర్టు జడ్జి మార్లిన్ హఫ్ తెలిపారు. రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సుమారు ఆరు లక్షల డాలర్లు చెల్లించాలని జడ్జి తీర్పునిచ్చారు. మైక్రోసాఫ్ట్కు అనుసంధానంగా పనిచేస్తున్న కార్ల్స్బాడ్ కంపెనీకి దీపాన్షును రిక్రూట్ చేశారు. అయితే దీపాన్షు పనితీరు పట్ల కార్ల్స్బ్యాడ్ కంపెనీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. అతన్ని తొలగించారు. ఉద్యోగం కోల్పోయిన దీపాన్షు 2018లో ఇండియాకు తిరిగివచ్చేశాడు. అయితే అతను ప్రతీకారంతో కార్ల్స్బ్యాడ్ లో ఉన్న సర్వర్ను హ్యాక్ చేసి సుమారు 1200 మంది యూజర్ల అకౌంట్లను డిలీట్ చేశాడు. దీపాన్షు మళ్లీ 2021లో అమెరికా వెళ్లాడు. అప్పుడు అతన్ని సైబర్ అధికారులు అరెస్టు చేశారు.