హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మూడోదశ ఈ నెల 1నుంచి మొదలైంది. మొదటిదశలో 60 ఏండ్లకు పైబడినవారికి, రెండోదశలో 45 ఏండ్లకు పైబడినవారికి టీకాలు ఇవ్వగా.. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని కేంద్రం ప్రకటించింది. టీకా వేసుకోవాలంటే కొవిన్ సాఫ్ట్వేర్లో తప్పనిసరిగా నమోదై ఉండాలని షరతు పెట్టింది. ఇక్కడే కొన్ని చిక్కులు మొదలయ్యాయి. చదువురానివారు, వృద్ధులు, ఫోన్లేనివారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. సాంకేతికంగా పరిజ్ఞానం లేనివారికి సైతం తిప్పలు తప్పడం లేదు. దీనికి పరిష్కారం సైతం మన చేతుల్లోనే ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. మంచి ఉద్దేశంతోనే ‘రిజిస్ట్రేషన్ తప్పనిసరి’ నిబంధనను పెట్టారని, యువత ముందుకు వచ్చి ఇబ్బందులను అధిగమించవచ్చని అంటున్నారు.
ఎందుకీ రిజిస్ట్రేషన్?
రిజిస్ట్రేషన్ తప్పనిసరి నిబంధనకు అనేక కారణాలు ఉన్నాయన్నది నిపుణుల మాట. మొదటిది.. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుంటే టీకా కేంద్రం వద్ద భారీ సంఖ్యలో బారులు తీరే అవకాశం ఉన్నది. దీంతో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది. రెండోది.. ప్రస్తుతం దేశంలో సరిపడా టీకాలు అందుబాటులో లేవు. కాబట్టి నియంత్రిత విధానంలో, రోజూ నిర్ణీత సంఖ్యలో టీకాలు వేయాల్సి ఉంటుంది. మూడోది.. టీకా కేంద్రంలోనే వివరాలను నమోదుచేసుకొని, వాటిని అప్లోడ్ చేయడం శ్రమతో కూడుకున్న పని. వైద్యసిబ్బందికి అదనపు భారం. నాలుగోది.. ముందస్తు రిజిస్ట్రేషన్లు ఉంటే ఒక ఆరోగ్యకేంద్రం పరిధిలో ఎవరెవరు టీకాలు వేసుకున్నారు? ఎంత మందికి వేయాలి? అనే వివరాలు ఉంటాయి. వ్యాక్సినేషన్పై ఓ అంచనాకు రావొచ్చు. వీటితోపాటు కావాల్సిన టీకా కేంద్రాన్ని ఎంపిక చేసుకొనే, నచ్చిన తేదీన వ్యాక్సిన్ వేసుకొనే అవకాశం ఉంటుందని ముందస్తు రిజిస్ట్రేషన్ నిబంధనను పెట్టినట్టు నిపుణులు చెప్తున్నారు.
అమలులో అనేక సమస్యలు
ముందస్తు రిజిస్ట్రేషన్ లక్ష్యం మంచిదే అయినా అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొవిన్లో రిజిస్టర్ కావాలంటే మొబైల్ నంబర్ ఉండటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం తెలిసి ఉండాలి. దేశంలో సగం మందికే ఇంటర్నెట్ ఉన్నది. ఇందులో 30% మందికి యూట్యూబ్, వాట్సాప్ వాడటం తప్ప.. రిజిస్ట్రేషన్ చేసుకొనేంత పరిజ్ఞానం లేదని నిపుణులు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్తో చదువురానివారు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
కొవిన్లో ‘సెక్యూరిటీ కోడ్’
కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం కొవిన్ పోర్టల్లో ‘నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్’ను తీసుకొచ్చింది. వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకొని, వ్యాక్సిన్ స్లాట్ను బుక్ చేసుకున్నాక రిజిస్టర్ మొబైల్ నెంబర్కు 4 అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సిన్ వేసుకొనే సమయంలో అక్కడి సిబ్బందికి ఈ కోడ్ను చెప్పాల్సి ఉంటుంది. శనివారం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నది.
సెక్యూరిటీ కోడ్ పొందే విధానమిది!
https://www.cowin.gov.in పోర్టల్లో ముందు రిజిస్టర్ అవ్వాలి.మొబైల్ నెంబర్, అర్హుల ఆధార్ వివరాలు నమోదు చేయాలి.రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, పిన్కోడ్ను నమోదుచేసి టీకా కేంద్రాలు, డోసుల లభ్యతను బట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి.అపాయింట్మెంట్ బుక్ అయ్యాక, మొబైల్కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది.అపాయింట్మెంట్ కన్ఫామ్ అయినట్టు తెలిపే పత్రంపై కూడా ఈ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది.స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి సిబ్బందికి సెక్యూరిటీ కోడ్ చెప్తేనే వ్యాక్సిన్ వేస్తారు.