దీక్షిత్శెట్టి, పృథ్వీ, ఖుషి నాయకానాయికలుగా నటించిన కన్నడ చిత్రం ‘దియా’. ఈ సినిమాను నిర్మాతలు ఆర్కే నల్లం, రవికశ్యప్ తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. కె. ఎస్. అశోక దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్లో చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఓ యువతి జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరబ్బాయిలు, వారి ప్రేమప్రయాణం ఏ తీరాలకు చేరిందనేది హృద్యంగా ఉంటుంది. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అని తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని హీరోయిన్ ఖుషి చెప్పింది. మూడు హృదయాల సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించే చిత్రమిదని గేయరచయిత పూర్ణాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, నరసింహా తదితరులు పాల్గొన్నారు.