‘కథాంశాల ఎంపికలో నవ్యంగా ఆలోచించినప్పుడే నాలాంటి కొత్తహీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు’ అని అన్నారు తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఎస్.ఎస్.రాజు దర్శకుడు. ఈ నెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం తేజ సజ్జా పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..
రెగ్యులర్ లవ్స్టోరీస్కు పూర్తి భిన్నంగా సరికొత్త కథాంశంతో రూపొందుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను పంచుతుంది.
మలయాళ చిత్రం ‘ఇష్క్’ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మూలకథలో పెద్దగా మార్పులు చేయలేదు. నిడివి తగ్గిస్తూ మరింత ఎంగేజింగ్గా రూపొందించాం. అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. కథాగమనం పూర్తిగా నా క్యారెక్టర్పైనే ఆధారపడి సాగుతుంది. హీరోగా గత చిత్రాలకు మించి పేరుతెచ్చిపెడుతుందనే నమ్మకముంది. లాక్డౌన్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా?లేదా? అన్న భయం నాలోనూ ఉంది. కానీ కథపై ఉన్న నమ్మకంతో ఏ ప్లాట్ఫామ్లో ఈ సినిమా విడుదలైనా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అనుకుంటున్నా.
సమంతకు చెబుతుంటా..
మొదటి సినిమా నుంచి కథ, పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ప్రస్తుతం పోటీ తరుణంలో వినూత్నమైన కథలు దొరకడం కష్టంగా మారింది. ఒకవేళ కొత్త పాయింట్ దొరికినా దానితో నిర్మాతల్ని ఒప్పించడం కష్టంగా ఉంటోంది. నా దగ్గరకు వచ్చే ప్రతి కథ గురించి నందినిరెడ్డి, సమంత, ప్రశాంత్వర్మలతో డిస్కస్ చేస్తుంటా. కానీ అంతిమనిర్ణయం మాత్రం నాదే. ప్రశాంత్వర్మతో చేస్తున్న ‘హను-మాన్’ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ నెలాఖరులోగా సినిమాను పూర్తిచేయాలనుకుంటున్నాం. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.