న్యూఢిల్లీ, మే 13: వచ్చే ఆగస్టు నుంచి డిసెంబరు నాటికి ఐదునెలల కాలంలో 216 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం గురువారం తెలియజేసింది. దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేసేందుకు ఇవి సరిపోతాయని పేర్కొన్నది. రష్యాలో తయారైన స్పుత్నిక్-వీ టీకా కూడా వచ్చేవారంలోగా అందుబాటులో ఉంటుందని తెలిపింది. నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం.. ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో 75 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 కోట్ల డోసుల కొవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ‘బయోలాజికల్ ఈ’ ఫార్మా కంపెనీ 30 కోట్ల డోసులను, జైడస్ క్యాడిలా 5 కోట్ల డోసులను, సీరం ఇన్స్టిట్యూట్ 20 కోట్ల డోసుల నొవావాక్స్ను, భారత్ బయోటెక్ 10 కోట్ల డోసుల నాజల్ వ్యాక్సిన్ను, జెన్నోవా 6 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమయంలో 15.6 కోట్ల స్పుత్నిక్-వీ డోసులు అందుబాటులోకి వస్తాయని పాల్ తెలిపారు. బయోలాజికల్ ఈ, జైడస్ క్యాడిలా, జెన్నోవా, భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ మొదలైనవి వేర్వేరు ప్రయోగదశల్లో ఉన్నాయన్నారు.
విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు
ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి విదేశీ కంపెనీల నుంచి టీకాల కొనుగోలుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని పాల్ వెల్లడించారు. వచ్చే ఏడాది తొలి మూడు నెలల నాటికి దాదాపు 300 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. టీకాల సేకరణలో తమకు స్వేచ్ఛ కావాలని రాష్ట్రాలే డిమాండ్ చేశాయని గుర్తుచేశారు. విదేశాల్నించి కేంద్రమే టీకాలను కొనుగోలు చేయకుండా.. రాష్ట్రాలు ఆ పని చేసుకోవచ్చని చెప్పడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించడంపై పాల్ పైవిధంగా స్పందించారు.