అబిడ్స్, చాంద్రాయణగుట్ట, మే 18 : లాక్డౌన్ నేపథ్యంలో ధరలను పెంచి విక్రయాలు చేపడితే కేసులు తప్పవని పౌర సరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలా చేపట్టిన వ్యాపారులను గుర్తించి అపరాద రుసుము విధిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది.
ఉదయం 6 నుంచి 10గంటల వరకు సడలింపు ఉండటంతో వ్యాపారులు ఆ నాలుగు గంటల సమయంలో విక్రయాలు చేపడుతున్నారు. మెడికల్ హాల్ మాత్రం అత్యవసర సర్వీసుల్లో భాగంగా తెరిచి ఉంచుతున్నారు. అయితే మెడికల్హాళ్లలో మందులు, కిరాణా దుకాణాల్లో నిత్యావసరాలను కొందరు వ్యాపారులు ఎంఆర్పీ ధర కన్నా అధికంగా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు.. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతలశాఖ, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది.
పాతబస్తీ ప్రాంతంలో ఆ బృందాలు రెండు రోజులుగా దాడులను నిర్వహించి కేసులను నమోదు చేస్తున్నాయి. సోమవారం తాడ్బండ్, కాలపత్తర్ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లు, మెడికల్ హాళ్లపై దాడులు నిర్వహించగా రెండు కిరాణ దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.15వేల అపరాధ రుసుం విధించారు. మంగళవారం జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ టీం సభ్యులు, అసిస్టెంట్ సివిల్ సైప్లె ఆఫీసర్లు తనుజ, అలీలు, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ సరోజ, ఫుడ్ ఇన్స్పెక్టర్ సిరాజ్లతో కలిసి శంషీర్గంజ్ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లు, మెడికల్ హాళ్లపై దాడులు నిర్వహించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పరిశీలించారు. రెండు కిరాణా దుకాణాల్లో అధిక ధరలకు నిత్యావసర సరుకులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మెడికల్హాల్లో పల్స్ఆక్సిమీటర్, ఫేస్ మాస్కులకు ఎలాంటి తయారీ కంపెనీ వివరాలు లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి రూ. 25వేల అపరాధ రుసుం విధించారు.
అధిక ధరలకు నిత్యావసర సరుకులను విక్రయిస్తే కేసులను నమోదు చేయక తప్పదు. ఎంఆర్పీ లేకుండా విక్రయాలు చేపట్టడం, తయారీ కంపెనీ పేరు లేకుండా విక్రయాలు చేసే దుకాణాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటైన జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులమంతా కలిసి ఈ దాడులు చేపట్టి అపరాధ రుసుం విధిస్తున్నాం. కరోనా పరిస్థితుల్లో ప్రజలను దోచుకునే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. – తనుజ, అసిస్టెంట్ సివిల్ సైప్లె ఆఫీసర్