కాలం వెనక్కి వెళ్లి చరిత్రను తరచి చూడాలన్న కుతుహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే చారిత్రక చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ తరహా కథాంశాల్లో నటించే అవకాశం కోసం కథానాయికలు ఎదురుచూస్తుంటారు. అభినయపరమైన ప్రతిభను చాటడంతో పాటు కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతాయనే లక్ష్యంతో చారిత్రక సినిమాల పట్ల నాయికలు వ్యామోహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అగ్ర కథానాయికలు చారిత్రక చిత్రాల్లో భాగస్వామ్యులవుతున్నారు. అలనాటి యువరాణులుగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
చెన్నై సొగసరి త్రిష సినీ పరిశ్రమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటింది. అయినా ఈ సుందరి హవా ఏ మాత్రం తగ్గలేదు. కొత్త తారలతో పోటీపడుతూ అగ్రనాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోన్న ఈ అమ్మడు త్వరలో వెండితెరపై చోళ యువరాణిగా దర్శనమివ్వబోతున్నది. తమిళ చారిత్రక నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ రాజు రాజరాజ చోళుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష చోళ యువరాణి కుందవి పాత్రలో కనిపించబోతున్నది. సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన యువరాణిగా ఆమె పాత్ర వినూత్నంగా సాగనున్నట్లు సమాచారం. తన పాత్ర కోసం త్రిష కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నది. ఈ సినిమాలో విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నది. చోళ రాజ్య పతనం కోరుకునే నందిని అనే రాణిగా నెగెటివ్ షేడ్స్తో ఆమె పాత్ర సాగనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె ఈ సినిమాలో కనిపిస్తుందని సమాచారం.రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయంరవితో పాటు తమిళ చిత్రసీమకు చెందిన పలువురు అగ్రనాయకానాయికలు నటించబోతున్నారు.
పవన్కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’. పదిహేడవ శతాబ్దంతో పాటు సమకాలీన కాలాన్ని ఆవిష్కరిస్తూ చారిత్రక కథకు ఫిక్షనల్ అంశాల్ని జోడించి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొఘల్ సామ్రాజ్య యువరాణిగా నిధి అగర్వాల్ కనిపించబోతున్నట్లు సమాచారం. హీరో లక్ష్యసాధనకు తోడ్పాటునందించే రాణిగా ఆమె పాత్ర ఆసక్తికరంగా సాగుతుందని చెబుతున్నారు. పవన్కల్యాణ్ బందిపోటు దొంగగా నటించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
అలనాటి క్వీన్గా వెండితెరపై అలరించేందుకు చెన్నై సుందరి రెజీనా సిద్ధమైంది. ఆమె కథానాయికగా మహిళా ప్రధాన కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘నేనే నా’. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాణిగా, ఆర్కియాలజిస్ట్గా డ్యూయల్ రోల్లో రెజీనా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే రెజీనా పోస్టర్ను చిత్రబృందం విడుదలచేసింది. రామాయణ గాథలోని శూర్పణఖను పోలి రెజీనా పాత్ర సాగుతుందని తెలిసింది.