ముంబై ,మే 6: కార్పోరేట్ సంస్థలు కరోనా నియంత్రణ కార్యకలాపాలకు చేసే ఖర్చులను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద చూపవచ్చని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచి రక్షణ కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి నిల్వ ప్లాంట్ల స్థాపన, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలెటర్లు, సిలిండర్లు, ఇతర వైద్య పరికరాల తయారీ, సరఫరా అన్నీ సీఎస్ఆర్ కిందకు వస్తాయని తెలిపింది.
కంపెనీస్ యాక్ట్ ప్రకారం రూ.500 కోట్లు అంతకుమించి వ్యాపారం, లేదా రూ.1000కోట్లు అంతకుమించి టర్నోవర్ లేదా రూ.5 కోట్లు అంతకుమించి నెట్ ప్రాఫిట్ ఉంటే ఆయా సంస్థలు నెట్ ప్రాఫిట్ పైరెండుశాతం సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాలి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో రిలయన్స్ వంటి సంస్థలు ఆక్సిజన్ తయారీ, మరిన్ని సంస్థలు ఇతర వైద్య పరికరాల తయారీలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని సీఎస్ఆర్ కింద చూపించవచ్చు.
కాగా, కరోనా వైరస్పై పోరాడేందుకు తమ వంతు నిధులతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలని కేంద్రమంత్రి సదానందగౌడ పిలుపునిచ్చారు. అలాగే కరోనా బాధితుల చికిత్స కోసం తాత్కాలిక ఆసుపత్రులు, సంరక్షణా కేంద్రాల ఏర్పాటు కోసం చేసే ఖర్చు చేసే నిధులను సీఎస్ఆర్ కింద పరిగణిస్తామని గత ఏప్రిల్లో కేంద్రం తెలిపింది.