హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ఊబకాయులు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు హైరిస్క్ క్యాటగిరీలో ఉన్నారని చెప్తున్నారు. ఊబకాయుల్లో చాలామందికి ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలు, గుండెజబ్బులు వంటివి ఉంటున్నాయని, వారు కొవిడ్ బారిన పడితే చికిత్స కష్టమవుతున్నదని వెల్లడించారు. ప్రసుత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నవారిలో 40 శాతం మంది ఊబకాయులేనని తాజా అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు కరోనాబారిన పడి మరణించినవారిలో 50 శాతం వరకు ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. సాధారణ కొవిడ్ రోగులతో పోల్చితే ఊబకాయులకు చికిత్స కాస్త కష్టమవుతున్నదని హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్ సీనియర్ సర్జన్ సతీశ్రెడ్డి పేర్కొన్నారు. సాధారణ రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు పెంచేందుకు ‘ప్రోనింగ్’ చేస్తామని, ఊబకాయులకు సాంకేతికంగా ఇలా చేయడం సాధ్యం కాదన్నారు. వాళ్లు బరువు తగ్గటం, ఆరోగ్యంగా ఉండటంపైనా దృష్టిపెట్టాలని సూచించారు. వ్యా యామం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలని, పౌష్ఠికాహారం తీసుకోవాలని సూచించారు.
కారణాలేంటి?
ఊబకాయులకు శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతింటుంది. శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. గొంతు, ఛాతి వద్ద కొవ్వు పేరుకుపోవటంతో పడుకున్నప్పుడు గురక రావడం, ఊపిరితిత్తులపై భారం పెరిగి తగినంత ఆక్సిజన్ పీల్చుకోలేకపోతారు. దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అనీమియా (ఓఎస్ఏ) అంటారు. ఇతర అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గుండె సమస్యలు మొదలవుతాయి. కొ విడ్-19 వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపైనే ప్రభావం చూపిస్తున్నది కాబట్టి ఊబకాయులకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పారు.
ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే
అధిక బరువుతో బాధపడుతున్నవారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతింటుంది. వీరికి కొవిడ్ సోకి తే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు అవుతుం ది. సాధారణ కొవిడ్ రోగులకు నాలుగు లీటర్ల ఆక్సిజన్ అవసరమైతే ఊబకాయులకు 10-12 లీటర్ల ఆక్సిజన్ కావాలి. వీరు కోలుకునే రేటు కూడా తక్కువ. ఒకవేళ దవాఖాన నుంచి ఇంటికి వెళ్లినా వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద కొన్నాళ్లపాటు ఆక్సిజన్ థెరపీ కొనసాగించాల్సి ఉంటుంది.