హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు. ఓ పత్రికా ప్రకటన ద్వారా ఆయన ఈ విధంగా స్పందించారు. ఈటల రాజేందర్ శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సైతం బీసీలు, ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. ఇదే రాజేందర్ దాదాపు రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదు సరికదా తాను ఒక బలహీన బడుగు వర్గానికి చెందిన వ్యక్తిగా ఎప్పుడు చెప్పుకోలేదు.
ఎమ్మెల్యేగా మంత్రిగా అంతకుముందు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించారు. అందులో తన ముదిరాజ్ కులస్థులకు టికెట్లు ఇప్పించగలిగారు. పైపెచ్చు తన బీసీ వర్గానికి చెందిన వారు టీఆర్ఎస్లోకి రాకుండా వచ్చిన వారికి టికెట్టు దక్కకుండా చేశారు. ఇదంతా తనకున్న అభద్రాభావం కారణంగానే చేశారు. ఆయనకు వ్యాపార ప్రయోజనాల కోసం అధికారం కోసం బీసీల ప్రయోజనాలను పనంగా పెట్టి ఇతరుల అధికారం ఎవరి దగ్గరైతే ఉందో వారి అడుగులకు మడుగులొత్తారు.
ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నది కూడా తన వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులను సంరక్షించుకోవాడానికి మాత్రమే. అదేవిధంగా తాను మంత్రిగా ఉన్నప్పుడు బీసీ సంఘాలను విడదీయడానికి తనవంతు ప్రయత్నం చేశారు కూడా. అందువల్ల ప్రముఖ బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య ఇతర నాయకులు అర్థం చేసుకుని రాజేందర్కు దూరంగా ఉన్నారు. ఎవరు కూడా ఆయన పట్ల సానుభూతితో లేరు. ఇక బీజేపీ విషయానికి వస్తే అవినీతి ఆరోపణ అందునా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆరోపణలున్న వ్యక్తిని క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ ఏ విధంగా చేర్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు.