వేములవాడ కల్చరల్ : వేములవాడలోని రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం కొవిడ్ నిబంధనల మేరకు ఘనంగా జరిగింది. విశ్వక్షేణ పూజలో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్దతిలో కల్యాణ తంతును ఆలయ అర్చకులు నిర్వహించారు. రాజన్న ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ ,మున్సిపల్ తరపున చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, కమీషనర్ శ్యామ్ సుందర్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు.
ఉదయం 10.50 నిమిషాల నుండి 12.45 వరకు జరిగిన కల్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహించారు. హరిహర క్షేత్రమైన రాజన్న అలయంలో ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వైష్ణవ పురోహితులు కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణంలో ఆచార్య దంపతులుగా మారంగంటి గిరిధరాచార్యులు, మాధవి దంపతులు వ్యవహరించారు. ఆలయంలో కల్యాణం జరుగుతున్నంత సేపు మెట్ల వద్ద శివపార్వతులు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకుని తన్మయత్వంలో మునిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్, పర్యవేక్షకులు నటరాజ్, వారి నర్సయ్య, మహేష్, గోలి శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.