అమరావతి : కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వైద్య సేవలు అందకుండా అడ్డుపడుతున్నారు. గర్భిణీని ప్రసవం నిమిత్తం తరలించేందుకు అంబులెన్స్ వస్తుండగా కరోనా భయంతో గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.
విశాఖ జిల్లా జీ.మాడుగుల మండలం పాలమామిడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించేందుకు కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ గ్రామశివారుకు రాగానే గ్రామంలోకి రాకుండా స్థానికులు అడ్డుకున్నారు.
దీంతో గత్యంతర లేక కుటుంబ సభ్యులే కాలినడకన ఆమెను అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లోనే ఆమె ప్రసవించింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇద్దరినీ జీ.మాడుగుల దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.