ప్రణయబంధానికి పరిణయంతోనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. నచ్చిన తోడుతో ఏడడుగులు నడిస్తేనే జీవితానికి సాఫల్యత లభిస్తుంది. ప్రేమలో మునిగితేలుతున్న కథానాయికలు కూడా మనసిచ్చిన చెలికాడితో పెళ్లిపీటలెక్కే మధుర ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూడుముళ్ల బంధంతో జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితులు వారి ప్రయత్నాలకు బ్రేక్ వేస్తున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక నాయికల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.
స్వచ్ఛత, నిజాయితీ మూర్తీభవించిన ప్రేమకు ప్రతీకగా దర్శకనాయిక ద్వయం విఘ్నేష్శివన్, నయనతారను అభివర్ణిస్తారు. ఐదేళ్ల ప్రణయబంధంలో ఈ జంట మధ్య చిన్న మనస్పర్ధ కూడా రాలేదని వారి సన్నిహితులు చెబుతుంటారు. పరస్పరం విశ్వాసం, అనురాగం తోడుగా వీరి ప్రేమప్రయాణం సాఫీగా సాగిపోతోంది. విదేశాల్లో షికార్లు మొదలుకొని, కేరళలోని ఓనం వేడుకల్లో కలిసి పాల్గొనడం వరకు ఈ ప్రేమపక్షులు ఎప్పు డూ వార్తల్లో నిలుస్తుంటారు. గత ఏడాది ప్రథమార్ధంలోనే ఈ జంట వివాహానికి సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో
ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు సెప్టెంబర్లో పెళ్లిపీటలెక్కనున్నారని తెలిసింది. కరోనా సెకండ్వేవ్ సద్దుమణిగిన తర్వాత కుటుంబ సన్నిహితులు, ఇండస్ట్రీ మిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుకను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట. హిందూ, క్రిష్టియన్ సంప్రదాయ పద్దతుల్లో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇటాలియన్ థియేటర్ ఆర్టిస్టు మైకేల్ కోర్సల్తో తన ప్రేమబంధానికి రెండేళ్ల క్రితం గుడ్బై చెప్పింది శృతిహాసన్. ప్రేమ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, ప్రతి అనుభవం గొప్పదేనని విఫల ప్రేమకు సాంత్వన వచనాలు చెప్పుకుందీ భామ. గత రెండేళ్లుగా ఒంటరితనంతో సతమతమవుతున్న ఈ సుందరి ఈ మధ్యే కొత్త తోడుని వెతుక్కుంది. ఆర్టిస్టు శంతను హజారికాతో కొన్ని నెలలుగా సహజీవనం సాగిస్తోంది శృతిహాసన్. అతను అద్భుతమైన ప్రతిభావంతుడని, ప్రియుడి సాంగత్యంలో జీవితంలో కొత్త కాంతుల్ని చూస్తున్నానని పొగడ్తలతో ముంచెత్తుతోంది. మైకెల్ కోర్సల్తో విఫల ప్రేమ అనుభవం దృష్ట్యా తాజా ప్రేమాయణాన్ని పెళ్లిపీటల వరకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉందట శృతిహాసన్. కుటుంబ సభ్యులతో చర్చించి ఈ ఏడాదే ఏడడుగులు వేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు.
తెలుగుతెరపై తళుక్కున మెరిసి అనతికాలంలోనే యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మెహరీన్. ఎలాంటి హడావుడి లేకుండా గత మార్చిలో తన నిశ్చితార్థానికి సంబంధించిన వార్తను పంచుకొని ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరచింది మోహరీన్. పంజాబ్ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్తో మార్చి 12న మెహరీన్ నిశ్చితార్థం జైపూర్లో వైభవంగా జరిగింది. మరో రెండు నెలల్లో పెళ్లి జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంటకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్ వేసింది. దాంతో మరికొద్ది నెలల పాటు పెళ్లిని వాయిదా వేయాలనే ఆలోచనలో ఇరువురి కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగులో ప్రేమకథా చిత్రాల ద్వారా యువతకు చేరువైంది అవికాగోర్. రియాల్టీ అడ్వంచర్ షో ఏంటీవీ రోడీస్ పార్టిసిపాంట్ మిలింద్ చద్వానీతో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణాన్ని సాగిస్తోంది. గత ఏడాది నవంబర్లో ఇన్స్టాగ్రామ్ సాక్షిగా తన ప్రేమబంధాన్ని బయటపెట్టింది. తన జీవితంలో ఇదొక మరపురాని అధ్యాయమని, తన ప్రార్థనలన్నీ ఫలించాయని సంతోషం వ్యక్తం చేసింది. ‘నా హృదయంలో వెలుగులు నింపడానికే మిలింద్ను దేవుడు పంపించాడనుకుంటా. నా సమస్త భావోద్వేగాల్ని అర్థం చేసుకునే తోడు దొరికింది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అయితే భవిష్యత్తులో మాత్రం వివాహబంధంతో మా జీవితాల్ని పరిపూర్ణం చేసుకుంటాం’ అని అవికాగోర్ చెప్పింది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లికి సిద్ధమవుతున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు.