న్యూఢిల్లీ: తమకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఎటువంటి షోకాజ్ నోటీసు అందలేదని దేశంలోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వజీర్ ఎక్స్ తెలిపింది. తమ సంస్థ అన్ని చట్టాలకు లోబడి పని చేస్తుందని ప్రకటించింది. వజీర్ ఎక్స్లో పెట్టిన పెట్టుబడులు పూర్తిగా సురక్షితమని మదుపర్లకు హామీ ఇచ్చింది. ఎటువంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.
రూ.2,790.74 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ లావాదేవీలు విదేశీ మారక ద్రవ్య యజమాన్య చట్టం (ఫెమా)ను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ వజీర్ ఎక్స్ డైరెక్టర్లు నిశ్చల్ శెట్టి, సమీర్ హనుమాన్ మహత్రేలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు ప్రతిగా వజీర్ ఎక్స్ ప్రకటన చేసింది.
చైనీయుల నియంత్రణలోని చట్ట విరుద్ధ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్ లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని ఈడీ తెలిపింది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఇతర ఎక్స్చేంజ్ల నుంచి క్రిప్టో కరెన్సీలను వజీర్ ఎక్స్ అనుమతించిందని తెలిపింది.
విదేశాల్లోని వ్యక్తుల ఖాతాలు, ఎక్స్చేంజీల నుంచి క్రిప్టో కరెన్సీల మార్పిడిని, లావాదేవీలను అనుమతించడంలో వజీర్ఎక్స్ ఫెమా నిబంధనలను, కేవైసీ మార్గదర్శకాలను పాటించలేదని ఈడీ వివరించింది. సదరు వ్యక్తుల చిరునామా, లావాదేవీల లక్ష్యాలు, ఇతర వాలెట్ల యూజర్ల ఐపీ అడ్రస్లు సేకరించలేదు.
2019 సెప్టెంబర్లో చైనీయుల యాజమాన్యంలోని గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్.. భారత్లోని అతిపెద్ద ఎక్స్చేంజ్ వజీర్ఎక్స్ను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గత ఏప్రిల్ నాటికి రోజువారీగా వజీర్ఎక్స్ ట్రేడింగ్ లావాదేవీలు 200 మిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.
కానీ బినాన్స్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వజీర్ఎక్స్లో అవరోధాలు ఎదురయ్యాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వజీర్ ఎక్స్ను టేకోవర్ చేశాక దాని వాలెట్ల నుంచి బినాన్స్ వాలెట్లలోకి నిధుల బదిలీ జరుగడం సాధారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వజీర్ ఎక్స్కు బినాన్స్కు ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్ ఉంది. కానీ వజీర్ ఎక్స్లో క్లయింట్ల మధ్య లావాదేవీలు బ్లాక్ చైన్లో రికార్డు కాలేదని ఈడీ అభియోగం. అదే సమయంలో తమకు ఈడీ నుంచి ఏ నోటీసు అందలేదని వజీర్ ఎక్స్ పేర్కొనడం గమనార్హం.