రామకృష్ణాపూర్, ఏప్రిల్ 28 : సింగరేణి ఏరియా దవాఖానల్లో కరోనా బారిన పడిన వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, మెరుగైన వైద్యం అందిస్తున్నామని సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీపీ) బలరామ్ పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ ఏరియా దవఖానాను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ దవాఖానల్లో సైతం కరోనా రోగులకు ఆక్సిజన్ సదుపాయం, బెడ్లు దొరకని పరిస్థితులు నెలాకొన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో సింగరేణి సీఅండ్ ఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు అన్ని సింగరేణి ఏరియా దవాఖానల్లో అందుతున్న వసతులపై వైద్యులను, ఏరియాల జీఎంలను అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్ ఏరియా దవాఖాన సామర్థ్యం 150 పడకలు కాగా, 105 పడకలతో పూర్తి స్థాయి కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రస్తుతం 65 మంది కొవిడ్ రోగులు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. వీరికి ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు, డ్రగ్కంట్రోల్ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరిన్ని బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైద్యులు, నర్సుల కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిన నియమించే అనుమతిని డీవై సీఎంవోలకు ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు మాస్కు తప్పని సరిగా ధరించాలని, సామూహిక కార్యక్రమాలకు, విందులకు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జీఎం (ఎన్విరాన్మెంట్) కార్పొరేట్ డీ రవిప్రసాద్, ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, డీవైఏసీఎం ఉష, కొవిడ్ ఇన్చార్జిలు డాక్టర్ రాజారమేశ్బాబు, డాక్టర్ రామ్మోహన్, దవాఖాన సంక్షేమ అధికారి జీదుల శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.