మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ ఓపెనర్ మైకేల్ స్లేటర్లో మాల్దీవ్స్లోని ఓ బార్లో కొట్టుకున్నారన్న వార్త సంచలనం రేపింది. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటం, ఐపీఎల్ అర్ధంతరంగా ముగియడంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్కు వెళ్లిన సంగతి తెలుసు కదా. అయితే అక్కడి బార్లో ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లుగా ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ఈ ఇద్దరూ చాలా రోజులుగా మంచి ఫ్రెండ్స్ అయినా, ఓ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లిందని ఆ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.
అయితే దీనిపై ఈ ఇద్దరు క్రికెటర్లు వివరణ ఇచ్చారు. అవన్నీ ఉత్త పుకార్లే అని, అలాంటిదేమీ జరగలేదని స్లేటర్, వార్నర్ చెప్పారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్ఫీల్డ్కు ఎస్సెమ్మెస్ పంపించాడు. ఇదంతా పుకారే. వార్నర్, నేను మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు అని స్లేటర్ ఆ మెసేజ్లో స్పష్టం చేశాడు.
ఆ తర్వాత వార్నర్ కూడా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు. ఎలాంటి డ్రామా జరగలేదు. మీకు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మీకు అక్కడ ఉండి లేదా బలమైన ఆధారం ఉంటేనే ఏదైనా రాయండి. అసలు ఏమీ జరగలేదు అని వార్నర్ అన్నాడు.
గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపైనా నిషేధం విధించడంపై స్లేటర్ గుర్రుగా ఉన్నాడు. ఇది మాకు అవమానం. మమ్మల్ని ఇంత దారుణంగా చూస్తారా.. మీ చేతులకు రక్తం అంటింది ప్రైమ్ మినిస్టర్ అంటూ స్కాట్ మోరిసన్ లక్ష్యంగా స్లేటర్ విమర్శలు గుప్పించాడు.