జిల్లా సరిహద్దులో కఠిన ఆంక్షలు
టీఎస్ ఈ-పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి
పట్టణాలు, పల్లెల్లో కొనసాగుతున్న బంద్
జాతీయ రహదారులపై తగ్గిన అంతర్రాష్ట్ర వాహన రాకపోకలు
జిల్లాలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతోంది. సడలింపు సమయంలో కొంత రద్దీ నెలకొంటున్నప్పటికీ..ఆ తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దుల వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మంగళవారం పట్టణాలు, పల్లెల్లో అమలవుతున్న పకడ్బందీ కట్టడితో అంతా నిర్మానుష్యంగా ఉంటుండగా..జాతీయ రహదారులపై అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారుల మీదుగా ఆయా రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలు తక్కువ సంఖ్యలో మాత్రమే నడుస్తున్నాయి. ఈ-పాస్లు ఉన్నవారికి మాత్రమే లాక్డౌన్ సమయంలో ప్రయాణానికి పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
-యాదాద్రి భువనగిరి, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాదాద్రి, మే18 : కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ మంగళవారం 7వ రోజుకు చేరింది. యాదగిరిగుట్ట పట్టణవాసులు లాక్డౌన్కు మద్దతు పలుకుతూ ఇంటికే పరిమితమవు తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోపే తమతమ కార్యకలాపాలు ముగించుకుంటున్నారు. ఈ క్రమంలో 10 గంటలలోపు పట్టణంలో కూరగాయలు, దుకాణాలు, టిఫిన్ సెంటర్ల సందడిగా మారుతున్నాయి. 10 గంటల తరువాత దుకాణాలు మూసివేయడంతో ప్రశాంతంగా మారుతున్నాయి. పలువురు వ్యక్తులు అనవసరంగా రోడ్డుపైకి వస్తే పోలీసులు వారిని అడ్డుకుని తిరిగి ఇంటికి పంపుతున్నారు. లాక్డౌన్ను ఉల్లంఘించిన పలువురికి పోలీసులు జరిమానాలు వేశారు.
యాదగిరిగుట్ట రూరల్లో…
యాదగిరిగుట్ట రూరల్, మే 18 : కరోనా సెకండ్వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దానిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మంగళవారం కొనసాగింది. యాదగిరిగుట్ట పోలీసులు అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రజలు మండలంలోని గ్రామాల్లో షాపులను మూసివేసి లాక్డౌన్ పాటిస్తున్నారు.
సంస్థాన్ నారాయణపురంలో…
సంస్థాన్ నారాయణపురం, మే 18 : మండల వ్యాప్తంగా లాక్డౌన్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపు వ్యాపారులు దుకాణాలు ముసివేశారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ సుధాకర్రావు ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
రామన్నపేటలో..
రామన్నపేట, మే 18 : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఏడవ రోజు విజయవంతమైంది. దుకాణాలను ఉదయం 10 గంటల తరువాత వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. జనం ఇండ్ల నుంచి బయటకు రాలేదు. ఎస్ఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బందితో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, మే 18 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల వ్యాప్తంగా కట్టుదిట్టంగా మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలంతా ఉదయం 10 గంటల తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. సడలింపు సమయంలో మాత్రమే బయటకు వచ్చి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను, వస్తువులను కొనుగోలు చేశారు. దుకాణాదారులు లాక్డౌన్ సమయం ప్రారంభం కాగానే స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. లాక్డౌన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
మోత్కూరు, గుండాల మండలాల్లో…
మోత్కూరు, మే 18: కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఏడో రోజు మంగళవారం మోత్కూరు, గుండాల మండలాల్లో ప్రశాంతంగా జరిగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో, గుండాల మండల కేంద్రంలో సడలింపు సమయం ఉదయం 6నుంచి 10 గంటల వరకు దుకాణాలను వ్యాపారులు తెరిచి ఉంచారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడంలేదు. దీంతో పట్టణ, గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
చౌటుప్పల్లో…
చౌటుప్పల్, మే 18 : చౌటుప్పల్లో మంగళవారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 తర్వాత అందరూ ఇండ్లలోనే ఉన్నారు. బయటికి వస్తున్న వాహనదారులకు పోలీసులు లాక్డౌన్పై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు.
తుర్కపల్లిలో…
తుర్కపల్లి, మే 18 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మంగళవారం 7వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు చలానాలు వేశారు.
ఆలేరు టౌన్లో…
ఆలేరు టౌన్, మే 18 : ఆలేరులో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. ఉదయం 10 గంటల లోగా సామగ్రి కొనుగోలు చేసుకొని ఇంటికే పరిమితం అవుతున్నారు. 10 గంటల నుంచి దుకాణాలు మూసివేస్తున్నారు. దీంతో వీధులు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాహనాలు, ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేశ్ తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 18 : కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా పాటించారు. సడలింపు సమయంలో దుకాణాలు తెరిచి ఉండటంతో ప్రజలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ వివిధ వ్యాపారస్తులు దుకాణాలు మూసివేయడంతోపాటు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడంతో గ్రామాల్లోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్సై ఎండీ ఇద్రిస్అలీ పోలీసు సిబ్బందితో కలిసి మండలంలో పెట్రోలింగ్ నిర్వహించారు.
లాక్డౌన్ను పరిశీలించిన ఎమ్మెల్యే కిశోర్కుమార్
మోత్కూరు, మే 18: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పరిశీలించారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని కూడలిని కాలినడకన పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో రామన్నపేట సీఐ సీహెచ్.శ్రీనివాస్, ఎస్సై జి.ఉదయ్కిరణ్, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోశ్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బుషిపాక లక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కల్యాణ్చక్రవర్తి పాల్గొన్నారు.