యాదాద్రి, మే 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహస్వామి జయంతి ఉత్సవాలను అర్చకులు ఆంతరంగికంగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. పరమ ఏకాంతంలో మంత్ర సౌష్టవంగా, వేద సౌష్టవంగా, కళాత్మకంగా మహావైభోపేతంగా ఉత్సవాలు జరిగాయి. ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఉత్సవాల్లో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం బాలాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయ మండపంలో స్వస్తివాచనం, విశ్వక్సేనారధన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామివారికి లక్ష పుష్పార్చన గావించారు.
11 గంటలకు తిరు వెంకటపతి అలంకారసేవలో స్వామి వారిని ఆలయంలో ఊరేగించారు. సాయంత్రం 7 గంటలకు అంకురార్పణ, ఋత్విక్వరణం చేపట్టారు. సాయంత్రం స్వామివారి గరుడ వాహన పరవాసుదేవ అలంకార సేవను బాలాలయంలో ఊరేగించారు. ఆయా పూజాకైంకర్యాలలో ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనారసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాడూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రచార్యులు, శ్రీధరాచార్యులు ఆలయ ఏఈవో దోర్బాల భాస్కర్శర్మ, రమేశ్బాబు, పాతగుట్ట అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.
భక్తులు లేకుండా రెండోసారి..
కరోనా సెకండ్ వే నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో యాదాద్రీశుడి ఆలయంలో ఆస్థానపరంగా స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి జయంతి ఉత్సవాలు భక్తులు లేకుండా రెండోసారి జరుగుతున్నాయి. గతేడాది మేలో సైతం జయంతి ఉత్సవాలు భక్తులు లేకుండానే జరిపారు. వచ్చే ఏడాదిలో నూతనాలయంలో భక్తజన సంద్రంతో ఉత్సవాలు జరిగేలా స్వామివారు కరుణించాలని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజల చేపట్టారు.
ఆలయంలో నేడు..
నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అభిషేకం, నవ కలశస్నపనం, లక్ష కుంకుమార్చన, కాళీయ మర్థన అలంకార సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు నృసింహ మూలమంత్ర హవనం చేపట్టి, హనుమంత వాహనంపై శ్రీరామావతారం అలంకార సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
స్వామివారి శాస్ర్తోక్తంగా నిత్య ఉత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి నిత్యోత్సవాలు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం, అర్చనలు జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి మొదటగా సుదర్శన నారసింహహోమం చేపట్టిన అనంతరం నిత్య తిరుకల్యాణం నిర్వహించారు. అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. బాలాలయంలోని చరమూర్తులకు నిత్యపూజా కైంకర్యాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రివేళలో స్వామి అమ్మవార్లకు మహా నివేదన, శయనోత్సవం జరిపారు.