వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 20 : వరంగల్ విశ్వకర్మవీధికి చెందిన చందుల యశస్వి నృత్య కళారంగంలో నేషనల్ అవార్డు-2021ను అందుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ జ్ఞానసభ వేదికగా నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నృత్యపోటీల్లో ఆమెకు ఈ అవార్డు దక్కింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణుగోపాలచారి, నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ మధుసూదన్రావు, బోర్డు డైరెక్టర్ బింగి నరేందర్ గౌడ్ హాజరై అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయ కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న నృత్య పోటీలకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుందన్నారు. చిన్న వయసులోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన యశస్వికి మంచి భవిష్యత్ ఉందన్నారు.
శ్రీహాసిని, అక్షరకు నాట్యమయూరి అవార్డులు
వరంగల్ నగరానికి చెందిన బైరి శ్రీహసిని, చెలగాని అక్షరకు నాట్యమయూరి అవార్డులు ప్రదానం చేశారు. హైదరాబాద్లోని త్యాగరాయగాన సభలో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ, ఆకాశ్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారికి అవార్డులు అందజేశారు. గురువు ముత్యాల పరమేశ్వర్ ఆధ్వర్యంలో వరంగల్ నృత్య రవళి తరఫున వారు పాల్గొని అవార్డులు అందుకున్నారు. చిన్నారులకు వేణుగోపాలాచార్యులు, జడ్జి మధుసూదన్రావు, బింగి నరేందర్, ఎన్డీసీఏ డైరెక్టర్ తదితరులు అవార్డు అందజేసి అభినందించారు.