విప్ బాల్క సుమన్
బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం
చెన్నూర్ రూరల్, మే 16 : లంబాడిపల్లి సర్పంచ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెన్నూర్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని లంబాడిపల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీప్రియ భర్త కృష్ణ నాయక్ ఇటీవలే మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. లంబాడిపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత సర్పంచ్ల ఎన్నికల సమయంలో ఏకగ్రీవం కావడానికి కృష్ణ చాలా కష్టపడ్డాడని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే కృష్ణ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఓ మంచి యువ నాయకుడిని కోల్పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన వెంట జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, పీఏసీఎస్ చైర్మణ్ చల్ల రాంరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులున్నారు.
కార్యకర్తల కుటుంబాలకు..
రామకృష్ణాపూర్, మే 16 : క్యాతనపల్లి మున్సిపాలిటీలో కరోనా బారిన పడి మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ టీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు పొన్నమనేని ఆంజనేయులురావు కరోనాతో మృతి చెందాడు. అతని కుటుంబసభ్యులను పరామర్శించి వారి కుటుం బ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేశారు. మున్సిపాలిటీలోని 7వ వార్డు పార్టీ సీనియర్ కార్యకర్త నల్లాల శ్రీనివాస్ కొవిడ్తో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. 14వ వార్డు మల్లికార్జుననగర్కు చెందిన పార్టీ కార్యకర్త సంపత్ ఇటీవ ల కరోనాతో మృతి చెందాడు. అతని కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు బోయినపల్లి అనిల్రావు, పోలం సత్యనారాయణ, గడ్డం విజయలక్ష్మీరాజు, రేవెల్లి ఓదెలు, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్ అలీ, కంభగోని సుదర్శన్గౌడ్, పార్టీ సమన్వయ కర్తలు అబ్దుల్అజీజ్, బోయినపల్లి నర్సింగరావు, అలుగుల సత్యయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిలో..
మందమర్రి, మే 16 : మందమర్రి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బండారు రాజ్కుమార్ మృతిచెందాడు. ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి రాజ్కుమార్ ఇంటికి వెళ్లిన విప్ మొదట రాజ్కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని తెలిపారు. వారిని, వారి కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకోవడం తమ బాధ్యత పేర్కొన్నారు. అనంతరం మూడో జోన్కు చెందిన టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సైరాభాను తండ్రి ఇటీవల మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. విప్ వెంట జడ్పీటీసీ వేల్పుల రవి, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు బడికెల సంపత్కుమార్, మేడిపల్లి సంపత్, జే రవీందర్, తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు.