కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇవాళ ఉదయం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ తేలిన ఆయనకు ఇవాళ ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా తక్కువ నమోదు అయ్యాయి. దీంతో డాక్టర్ల ఆదేశంతో ఆయన్ను హాస్పిటల్లో చేర్పించారు. మాజీ సీఎం బుద్దదేవ్ ఆరోగ్యం క్షీణించినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. 77 ఏళ్ల భట్టాచార్యకు గత వారమే కరోనా వైరస్ సంక్రమించింది. మొదట ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించారు. కానీ ఆక్సిజన్ లెవల్స్ డౌన్ కావడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు.
బెంగాల్ రాజకీయాల్లో సీపీఎం సీనియర్ నేతగా భట్టాచార్య ఎంతో ప్రఖ్యాతి గాంచారు. అయితే గత దశాబ్ధ కాలం నుంచి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ నుంచి ఆయన బాధపడుతున్నారు. బుద్దదేవ్ భార్య మీరా భట్టాచార్య కూడా వైరస్ పరీక్షలో పాజిటివ్ తేలారు. కానీ ఆమె సోమవారమే ప్రైవేటు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది అక్టోబర్లో కూడా భట్టాచార్యకు హాస్పిటల్లో చికిత్స అందించారు. అప్పుడు ఆయన్ను వెంటిలేటర్పై ఉంచారు. 13 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఆయనకు చికిత్స అందించింది.