న్యూఢిల్లీ: ప్రముఖ బిలియనీర్, దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్.. హ్యాక్టివిస్ట్ గ్రూప్ అనానిమస్కు లక్ష్యంగా మారారు. క్రిప్టో కరెన్సీపై ఆయన ఇటీవల చేసిన ట్వీట్లు దానిపై ఆధారపడ్డవారి జీవితాలను నాశనం చేసేలా ఉన్నాయని ఆరోపిస్తూ టెస్లా సీఈవోపై అనానిమస్ ఓ వీడియోలో విరుచుకుపడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీపై ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లను హ్యాక్టివిస్ట్ గ్రూప్ చూపెట్టింది. మస్క్ ట్వీట్లు క్రిప్టో కరెన్సీ పతనానికి దారితీస్తున్నాయని, లక్షలాది మంది రిటైల్ పెట్టుబడిదారులకు తీవ్ర నష్టం వాటిల్లేలా ఉందని పేర్కొంది. తన స్వలాభం కోసమే ఎలాన్ మస్క్ ఇలాంటి ట్వీట్లు చేశాడంటూ తీవ్రంగా ఆక్షేపించింది. తన ఎలక్ట్రిక్ కార్ల కోసం బిట్కాయిన్ చెల్లింపులను అంగీకరించబోమని మస్క్ ఇటీవల ప్రకటించారు. దీనిపై కూడా అనానిమస్ ఆరోపణలు చేసింది.
టెస్లా కంపెనీ కావాలనే బిట్కాయిన్ చెల్లింపులను నిలిపివేసిందని మండిపడింది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల నుంచి గ్రీన్ కార్బన్ టాక్స్ క్రెడిట్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకే ఇలా చేసిందని ఆరోపించింది. క్రిప్టో కరెన్సీపై మస్క్ చేసిన ట్వీట్లతోపాటు అతడి కంపెనీ, కార్యకలాపాలకు సంబంధించిన పలు విషయాలను కూడా బహిర్గతం చేసింది. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ..”మీరు ద్వేషించేదాన్ని చంపకండి.. ప్రేమించేదాన్ని రక్షించండి .” అంటూ ట్వీట్ ద్వారా బదులిచ్చారు.