హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ పీహెచ్సీ, బస్తీ దావాఖనాలు, జీహెచ్ఎంసీ ఏరియాలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఎక్కువ మందిని నియమించాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నాధికారులతో మంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకటి కరుణ, వైద్యారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యారోగ్య సిబ్బంది, అధికారులు అనేక రకాల ఒత్తిడిలో పని చేస్తున్నారు. కుటుంబాలను వదిలిపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే అందరి లక్ష్యం అన్నారు.
కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఎక్కువమంది హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశా వర్కర్లు రోజుకు రెండుసార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్షించాలి. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతాం. గతానికి భిన్నంగా ఈసారి ఇంట్లో ఒక్కరికి వస్తే మిగతా అందరికీ వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దానిని నివారించేందుకు ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం.
టెలీ మెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలి. ఐఎంఏ వారు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకోవాలి. గత వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదు. వ్యాప్తి తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.