బీజింగ్: చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మరో కీలక మార్పు చేసింది. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1970వ దశకం నుంచి 2016 వరకు ఒకే సంతానం అన్న విధానాన్ని చైనా కఠినంగా అమలు చేసింది. 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా దీనిని ముగ్గురికి పెంచడం గమనార్హం. సోమవారం చైనా అధ్యక్షుడు, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
చైనా జనాభా నిర్మాణ పద్ధతిని వృద్ధి చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అక్కడి అధికార మీడియా అభిప్రాయపడింది. ఏ దేశానికైనా యువత సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది ప్రధానం. కానీ చైనాలో మాత్రం వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి ఆ దేశం జనాభా నియంత్రణలో భాగంగా దశాబ్దాల పాటు అనుసరించిన వన్ చైల్డ్ పాలసీయే కారణం. ఈ ముగ్గురు పిల్లల కొత్త విధానాన్ని అన్ని స్థాయిల్లోని పార్టీ కమిటీలు, ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు.
2016లో ఇద్దరు పిల్లలను కనొచ్చని చైనా నిర్ణయించినా.. దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ దేశం ఎదుర్కొంటున్న వృద్ధ సమాజ సమస్యకు ఇది పరిష్కారం చూపించలేకపోయింది. దీంతో తాజాగా ముగ్గురు పిల్లలను కనొచ్చన్న నిర్ణయం తీసుకున్నారు. జనాభా నియంత్రణలో భాగంగా ఒకే సంతానమన్న కఠిన నిర్ణయాన్ని చైనా 1970 నుంచి అమలు చేస్తూ వచ్చింది. అయితే ఇది అక్కడి సమాజంపై ఇలా ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.
గత దశాబ్ద కాలంలో చైనా జనాభా కేవలం 7.2 కోట్లు మాత్రమే పెరిగింది. గడిచిన కొన్ని దశాబ్దాలలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ప్రస్తుతం 141 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో చైనా కొనసాగుతోంది. 2020, నవంబర్ 1నాటికి చైనా ప్రధాన భూభాగంలో 141.78 కోట్ల జనాభా ఉంది. జనాభా వృద్ధి రేటు గడిచిన దశాబ్దంలో కేవలం 0.53 శాతంగా ఉంది.