ముంబై : మహారాష్ట్రలో గత కొద్దినెలలుగా కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న 133 మందిపై ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అధికారులు కేసులు నమోదు చేశారు. రెమ్డిసివిర్, టొలిసిజుమాబ్ ఇంజక్షన్లు సహా ఇతర ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న వీరిపై కేసులు బనాయించామని ఎఫ్డీఏ అధికారులు బొంబాయి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కొవిడ్-19 చికిత్సలో వాడే మందుల బ్లాక్ మార్కెటింగ్ పై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఎఫ్డీఐ ఈ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. కరోనా మందుల బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని ఎఫ్డీఏ పేర్కొంది.
నవిముంబై, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో బ్లాక్ మార్కెటీర్లపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. ఎలాంటి లైసెన్సులు లేకుండా అధిక ధరలకు ట్రేడర్లు ఈ మందులను అమ్ముతున్నారని తెలిపింది. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో ఔషధాలు, ఇంజెక్షన్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారని పేర్కొంది.