నల్లగొండ : కులం, మతం, జాతి అనే తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీ అందరినీ ఆదరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. మంచి చేసే వాళ్లను ఆదరించి గెలిపిస్తే మంచి జరుగుతుందన్నారు. ఒకప్పుడు తెలంగాణ అనాథలా ఉండే. టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ సాధించామన్నారు. ఆత్మ బలంతో అడుగు ముందుకేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. దీక్ష విరమించమని డాక్టర్లు చెప్పారు. కానీ దీక్ష విరమించలేదు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అని దీక్ష పట్టి తెలంగాణ సాధించాం. ఓటేసే ముందు మీ అందరూ ఆలోచించాలి. కేసీఆర్ రావొద్దు. సభ జరగొద్దు అని హైకోర్టుకు, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారో.. మీరు ఆలోచించాలి. ఇవన్నీ మీకు తెలుసు. ఇవాళ ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెంచామన్నారు. అందరి కడుపులు నింపుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.