పట్నా : ఆర్థిక సాయం చేయకపోవడం, ఆస్తిలో వాటా పంచకపోవడంతో తల్లితండ్రులపై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంపతుల ఉసురుతీశాడు. పట్నాలోని రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాజీ చౌక్ ప్రాంతంలో వృద్ధ జంట నివాసంలోనే వారి కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏ ఉద్యోగం లేకుండా తిరిగే రాజన్ కుమార్(50) తన తండ్రి రిటైర్డ్ టీచర్ బ్రిజ్ కిషోర్ ప్రసాద్ సింగ్ (70), తల్లి కమల్ లతా దేవి(68)ని పొట్టనపెట్టుకున్నాడు. సింగ్ ఇటీవల కుమారుడికి ఆర్థిక సాయం అందించడం నిలిపివేయడంతో పాటు ఆస్తిలో వాటా పంచకపోవడంతో రగిలిపోయిన రాజన్ తన భార్య సంజు కుమారి(45) సాయంతో తల్లితండ్రులను గొంతుపిసికి హత్య చేశాడు.
ఆపై కొవిడ్-19తో తన తల్లితండ్రులు మరణించారని నమ్మబలికాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులకు వృద్ధ జంట గొంతుపై పెనుగులాడిన చిహ్నాలు కనపడటంతో రాజన్ ను ప్రశ్నించారు. నిందితులు రాజన్ ఆయన భార్య, కుమారుడు అవినాష్ లకు హత్యోదంతంలో ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తండ్రి ఉద్యోగం తనకు దక్కుతుందనే ఆలోచనతో గతంలో సింగ్ ను చంపేందుకు రాజన్ ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.