ఎన్నికల నియమావళి పాటించాలి
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 29 : పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సిద్దిపేటతో పాటు గజ్వేల్ 12వ వార్డులో జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. ప్రజలు, నాయకులు ఎన్నికల నియమాలు పాటించాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు బిగించామన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెబ్ కాస్టింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేకంగా నిఘా ఉంచేందుకు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియో ట్యాగింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన సత్వరమే పోలీసు యంత్రాంగం అక్కడకు చేరుకొని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని బార్డర్ పీఎస్, పట్టణ సరిహద్దులో స్టార్టిక్స్ సర్వెలైన్ టీమ్స్ 4 చెక్పోస్టులు ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేసినట్లు చెప్పారు. 24 గంటలు నిరంతర వాహనాల తనిఖీలు చేపడుతున్నామన్నారు. అన్ని శాఖల అధికారులతో కలిసి విధులు నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. క్రిటికల్ 32, నార్మల్ 99 కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అందులో భాగంగానే 502 పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షణ జరిపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భయబ్రాంతులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి ఎవరైన ఉల్లంఘిస్తే కమిషనరేట్ వాట్సాప్ నంబరు 7901100100 లేదా గజ్వేల్ ఏసీపీ 8333998684 లేదా డయల్ యువర్ 100కు ఫోన చేస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు.
పోలీసు అధికారులకు దిశా నిర్దేశం
ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ సూచించారు. ప్రతి గంటకు ఒకసారి చేతులకు శానిటైజర్ పెట్టుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎన్-95 మాస్క్లు అందించామని, విధిగా మాస్క్లు ధరించి విధుల్లో పాల్గొనాలన్నారు. మాస్క్లు లేని వారిని పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించవద్దని సూచించారు. అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. పోలింగ్ బూత్ సిబ్బంది 6 గంటలకే విధుల్లోకి హాజరు కావాలన్నారు. డ్యూటీ పాస్పోర్టు ద్వారా కేటాయించినట్టుగానే నడుచుకోవాలన్నారు. ఏజెంట్లను పోలింగ్ బాక్సులకు దూరం కూర్చోబెట్టాలని సూచించారు. పోలింగ్ అధికారి అనుమతి లేకుండా ఏజెంట్లను లోనికి పంపవద్దన్నారు. పోలింగ్ బూత్లోకి ఇంకు బాటిల్స్, వాటర్ బాటిల్స్ను ఓటర్లు, ఏజెంట్లు తీసుకరాకుండా తనిఖీ చేయాలన్నారు. ఓటర్లను క్యూపద్ధతిలోనే అనుమతించాలని, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనవసరమైన వ్యక్తులను ఎలాంటి పరిస్థితుల్లోను పోలింగ్ బూత్ల్లోకి అనుమతించకూడదన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్క ఓటరుతో మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ప్రజలు గుంపుగుంపులుగా ఉండకుండా వెంటవెంటనే అక్కడి నుంచి పంపించాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే వృద్ధులకు సహకరించాలన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి గంట ముందు నుంచే బ్యాలెట్ బాక్సులపై నిఘా పెట్టాలన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్లోకి అనుమతించే సమయంలో తనిఖీ చేయాలన్నారు. పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులకు కౌంటింగ్ కేంద్రాలకు భద్రంగా చేరవేయాలన్నారు. కేంద్రాల వద్ద ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. మొబైల్ పార్టీ పోలీసులు 30 నిమిషాలకు ఒకసారి పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేయాలన్నారు. పోలీసులందరూ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి కేటాయించిన ప్రాంతాలను విడిచి వెళ్లవద్దన్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు సూచనలు చేసిన సీపీ
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగేలా పోలీసులు అన్ని చర్యలను తీసుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపల్కు, గజ్వేల్లో 12వ వార్డుకు ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి గురువారం సీపీ జోయల్ డెవిస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా బందోబస్తుపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ ఎన్నికలు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్రూమ్ చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ జరుపాలన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల లోపు ఉన్న ప్రతి దుకాణాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.