ఖమ్మం, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నది. నేరుగా లబ్ధిదారుల ఇంటికి ఆహారం అందిస్తున్నది. దీనిలో భాగంగా వారికి అందించే మంచి నూనె ప్యాకెట్లనూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాలకు 15 కిలోల క్యాన్ అందేది. కొలతల్లో హెచ్చుతగ్గులు రావడం, లబ్ధిదారులకు సక్రమంగా నూనె అందడం లేదనే ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి పూనుకున్నది. నేరుగా లబ్ధిదారుల ఇంటికే నూనె ప్యాకెట్లు అందజేయాలని నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్లు జూన్, జూలై నెలల నూనె ప్యాకెట్లను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తున్నారు.
వేలాది మందికి లబ్ధి..
ఖమ్మం జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,837 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11,323 మంది గర్భిణులు, 8,942 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి సంవత్సరంలోపు చిన్నారులు 10,549 మంది, 1 3 ఏళ్లలోపు చిన్నారులు 30,549 మంది, 3-6 ఏళ్లలోపు చిన్నారులు 31,931 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నెలనెలా ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా మంచినూనె ప్యాకెట్లు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి కేంద్రాలకు చేరుకుంటాయి. ఆ తర్వాత అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ప్రస్తుతం జిల్లాకు 24,550 లీటర్ల మంచి నూనె అందుతున్నది. కేంద్రాలకు నాణ్యమైన మంచినూనె పంపిణీ చేసేందుకు రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ ఆయిల్ఫెడ్ సహకారంతో ‘విజయ సంస్థ’తో ఒప్పందం చేసుకున్నది.
పక్కాగా పంపిణీ..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికి నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. రెండు నెలలకు కలిపి ఒకేసారి అందిస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు పంపిణీ విధానంపై ఆరా తీస్తున్నాం.