జైపూర్: తాగునీటి కోసం జరిగిన ఘర్షణలో ఒకరిపై తప్పుడు కేసు పెట్టేందుకు ఒక అవ్వ తన మూడేండ్ల మనుమరాలిని హత్య చేసింది. రాజస్థాన్ బరాన్ ప్రాంతంలోని బోరినా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నీరు పట్టుకునే క్రమంలో మే 30న రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డగా మూడేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన అనంతరం పరారైన రామేశ్వర్ మొగ్యనే పాప మరణానికి కారణమని ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. నిందితుడు రామేశ్వర్ను కేసులో ఇరికించేందుకు నానమ్మ కనకాబాయ్ గొడవ సందర్భంగా గాయపడిన మనుమరాలిని చంపినట్లు తేలింది. ఘర్షణలో రామేశ్వర్ కుమార్తె కూడా గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానంతో కనకాబాయ్ను ప్రశ్నించి చివరకు ఆమెను అరెస్ట్ చేశారు.