సిద్దిపేట జోన్, ఏప్రిల్ 24 : ‘ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా? ఆపదలో ఆదుకునే వారు కావాలా? ఓట్ల నాడు వచ్చే పార్టీ మనుషులు కావాలా? ఆలోచించి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయండి’.. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 15వ, 31వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థులు జంగిటి కనకరాజు, పాతూరి సులోచన శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒకనాడు సిద్దిపేటలో నీళ్లు దొరకని పరిస్థితని, నేడు ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నామన్నారు. రూ.270 కోట్లతో యూజీడీ పనులు చేపట్టామన్నారు. పట్టణాన్ని అందంగా, పరిశుభ్రంగా చేసుకున్నామన్నారు. పందులు, కోతుల బాధ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, కుక్కలకు కుటంబ నియంత్రణ ఆపరేషన్ కోసం రూ.60 లక్షలతో దవాఖాన నిర్మించామని తెలిపారు. ప్రతి రోజు ఇంటి ముందుకే చెత్త బండి వచ్చి, తడి, పొడి చెత్త వేరు చేసి సేకరిస్తూ సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామన్నారు.
పేదలకు కార్పొరెట్ స్థాయి వైద్యాన్ని ఉచిత వైద్యం అందించడమే కాకుండా, దవాఖానకు వచ్చే తల్లీబిడ్డకు వేడివేడి అన్నం పెడుతున్నామన్నారు. సీఎం సహాయనిధి ద్వారా ఎంతో మందికి సహాయం చేశామని, తనతో నడిచే వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ‘ఓట్ల కోసం పెట్టే కోతి దండాలను నమ్మొద్దు.. మీ గౌరవాన్ని ఎప్పుడు పెంచేవాడిని నేను’.. అని చెప్పారు. మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. సిద్దిపేట టీఆర్ఎస్ అడ్డా కావాలని, తనకు కొండంత ధైర్యంగా ఉండాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు. విడిపోతే నష్టపోతామని, కలిసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పనకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాది చివరికల్లా రైలు రాబోతున్నదన్నారు. కప్పలకుంటను అభివృద్ధి చేస్తానని, ప్రతి అర్హుడి ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు పలు పార్టీల నుంచి మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి హరీశ్రావు కండువాలు కప్పారు. పెద్దమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు బోనాల ఉప్పలయ్య టీడీపీ నుంచి, బీజేపీ నుంచి శ్రీనివాస్, సురేష్, సుధాకర్, కృష్ణ, నర్సింలు, చంద్రం, కనకయ్య, స్వామి రాజు తదితరులు గులాబీ పార్టీలో చేరారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 24 : సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు.. కష్టంలోనూ సుఖంలోనూ ఉండేది ఎవరో ఆలోచించి ఓటెయ్యాలని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 3వ వార్డు అభ్యర్థి వంగ రేణుక తిరుమల్రెడ్డికి మద్దతుగా మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా మంత్రి హరీశ్రావు సమక్షంలో పలు కులసంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రంగధాంపల్లి గ్రామం ఎపుడూ ఒకే మాట, ఒకే బాటలో ఉంటారని, ఈ ఎన్నికల్లో కూడా ఒకే తాటిపై నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ దయ వల్లనే మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దూకుతున్నాయన్నారు. సిద్దిపేట ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే కావేరి సీడ్స్, అంబికా దర్బార్ అగర్బత్తి లాంటి కంపేనీలు వస్తాయన్నారు. మరో ఏడాదిలోపే సిద్దిపేటకు రైలు రాబోతుందన్నారు. అపోలో దవాఖాన మాదిరిగా సిద్దిపేట దవాఖాన ఉందని, పేదలకు ఉచిత వైద్యం అందించాలనే దవాఖానను నిర్మించామన్నారు. లాక్డౌన్ సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచూ సేవ చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఉమారాణ అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 24 : సిద్దిపేటను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి హరీశ్రావు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 12వ వార్డు అభ్యర్థి తేల్జీరు రేణుకా శ్రీనివాస్యాదవ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చేనేత మగ్గాలను సందర్శించి మగ్గం నేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.