గరుత్మంతుడికి ప్రత్యేక పూజలు
రేపు సీతారాముల కల్యాణం
వెలుగులీనుతున్న భద్రాద్రి ఆలయం
భద్రాచలం, ఏప్రిల్ 19: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ధ్వజారోహణం వైభవంగా సాగింది. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటాన్ని అర్చకులు ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. ఇప్పటి నుంచి పౌర్ణమి వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల గురించి దేవతలకు, మానువులకు తెలిసేలా ధ్వజారోహణం నిర్వహించడం భక్త రామదాసు కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
గరుడ పటానికి పూజలు..
అంతరాలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి, ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. గరుడ పటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి బ్రహ్మోత్సవాల రక్షణ కోసం గరుత్మంతుడిని ఆహ్వానించి, ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకం పఠించి గరుడ పటాన్ని ధ్వజ స్తంభం పైకి ఎగురవేశారు. అనంతరం బలిహరణం నిర్వహించారు. సంతానం లేనివారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. ఉదర సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న మహిళలు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
భేరీ పూజ..
సాయంత్రం యాగశాలలో భేరీ పూజ జరిపారు. అష్టదిక్పాలకులను, 33 కోట్ల దేవతలను ఆహ్వానించారు. 16 రకాల వాయిద్యాలకు షోడశోపచార పూజలు నిర్వహించి, వాయిద్యకారులను సత్కరించారు. అనంతరం భేరీ తాడనం (మోగించారు) చేశారు. ఉత్సవమూర్తులతో పాటు అష్ట దిక్కులకు బలిహరణం వేశారు.
నేడు ఎదుర్కోలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం చతుఃస్థానార్చన జరుపుతారు. గతంలో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేవారు. గత ఏడాది, ఈ ఏడాది ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలోనే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
పర్ణశాల ఆలయంలో..
పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 5 గంటల నుంచి ఉత్సవమూర్తులు, మూలవిరాట్లకు ప్రత్యేక పూజలతో పాటు అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
విద్యుత్ వెలుగుల్లో భద్రాద్రి ఆలయం
భద్రాచలం, ఏప్రిల్ 19: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 21న శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ సారి కూడా బేడా మండపంలో జరుగనున్న ఈ కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చే అవకాశాలున్నాయి. విద్యుత్ దీపాల వెలుగుల్లో భద్రాద్రి ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది.
రేపు రామయ్య కల్యాణం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న బేడా మండపంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు
IPL 2021: ఒకే ఓవర్లో రాయుడు, రైనా ఔట్