టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు
డిసెంబర్లోపు గణేశా ఈకో టెక్ కంపెనీ ప్రారంభం
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గీసుగొండ, మే 14 : వస్త్ర పరిశ్రమ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. టెక్స్టైల్ పార్కులోని 20 ఎకరాల స్థలంలో గణేశా ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం గణేశా ఈకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 20 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఈ భూమిని ఆరు యూనిట్లుగా విభజించి, కంపెనీ నిర్వాహకులు నిర్మాణ చేపడుతున్నట్లు చెప్పారు. మొదటి యూనిట్ పనులు డిసెంబర్ చివరి కల్లా పూర్తవుతాయన్నారు. ఈ యూనిట్లో 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. రూ.800 కోట్లతో కంపెనీ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో దారం, పీపీ ఫైబర్ వాషింగ్ ప్లాంట్ వస్తువులు తయారవుతాయన్నారు.
కరోనా కారణంగా అనేక కంపెనీలు తమ నిర్మాణ పనులను వాయిదా వేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అనేక కంపెనీలకు అనుమతులతో పాటు భూములను కేటాయించినట్లు చెప్పారు. కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిన వెంటనే మిగతా కంపెనీలు తమ పనులు ప్రారంభిస్తాయన్నారు. టెక్స్టైల్ పార్కులో నిర్మాణ పనులు పూర్తయితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భూములు కోల్పోయిన వారికి మొదటి దశలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. పార్కులో ఇప్పటికే రోడ్లు, కల్వర్టు, లైటింగ్, విద్యుత్ పనులను ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలిపారు. మిగతా పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, గణేశా కంపెనీ హెచ్ఆర్ రాకేశ్ పాల్గొన్నారు.