రాష్ర్టాల వద్ద ఇంకా 75 లక్షల డోసులున్నాయి: కేంద్రం
న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్ టీకాలకు కొరత ఉందన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 75 లక్షల కరోనా టీకా డోసులు ఉన్నట్టు తెలిపింది. మరో 45 లక్షల డోసులను మూడు రోజుల్లో సరఫరా చేస్తామని పేర్కొన్నది. ఇప్పటివరకు 16,69,97,410 డోసులను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో 15.94 కోట్ల డోసులను వినియోగించారని వెల్లడించింది. మరోవైపు, రెమ్డెసివిర్ నెలకు 1.05 కోట్ల వయల్స్ (ఇంజెక్షన్ సీసాలు) ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గత నెల 12 నాటికి నెలకు 37 లక్షల వయల్స్ మాత్రమే ఉత్పత్తి అయ్యేవన్నారు.