కేంద్రం శనివారం (మే 1 వతేదీ) నుంచి విస్తృతస్థాయి వ్యాక్సినేషన్కు అనుమతించి.. 18 ఏండ్లు నిండిన వారినీ టీకాకు అర్హులుగా ప్రకటించినప్పటికీ.. ఆచరణలో ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. చాలా రాష్ర్టాల్లో 45 ఏండ్లు నిండినవారికే ప్రస్తుతం టీకాలు వేసే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు లేక టీకా కేంద్రాలనే మూసేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలోని పరిస్థితులే దీనికి అద్దం పడుతున్నాయి.
న్యూఢిల్లీ:టీకాలు లేకపోవడంతో మహారాష్ట్ర లోని ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సి నేషన్ నిలిపివేస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి చేపట్టాల్సిన టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. టీకాలు వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ను కొనసాగిస్తామని పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ సర్కార్ వద్ద ప్రస్తుతం వేయటానికి టీకా అనేదే లేదని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ గురువారం ప్రకటించారు. ఉన్న వ్యాక్సిన్ నిల్వలు మొత్తం అయిపోయాయని వెల్లడించారు. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ప్రైవేటు కంపెనీలకు విజ్ఞప్తులు చేశామని, వాటి నుంచి స్పందన లభించిన తర్వాతే టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియజేయగలమని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో 18 ఏండ్లు దాటినవారందరూ టీకాలు వేసుకోవచ్చని భావిస్తూ వచ్చిన ఢిల్లీ వాసులను మంత్రి ప్రకటన షాక్కు గురి చేసింది. 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే టీకా వేస్తున్నప్పుడే పరిస్థితులు ఇలాఉంటే.. ఇక వారికి 18-44 ఏండ్లలోపు వాళ్లు కూడా కలిస్తే.. అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడున్నంత సజావుగానైనా జరుగుతుందా అని ఆరోగ్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్, పంజాబ్, ఏపీలోనూ 18+వారికి వ్యాక్సినేషన్ వాయిదా పడింది.
వ్యాక్సిన్ ఉంటేనే స్లాట్
18-44 ఏండ్ల వయసువాళ్లు టీకా తీసుకోవాలంటే కొవిన్ పోర్టల్ ద్వారాగానీ, ఆరోగ్యసేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి. అయితే, టీకా కోసం నిర్ణయించిన స్లాట్లు (అపాయింట్మెంట్లు) అందుబాటులో ఉంటేనే వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవటం వీలవుతుంది. టీకా అందుబాటులో ఉంటేనే స్లాట్లు కేటాయిస్తారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా కోసం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కోట్లాదిమంది యువతీ యువకులు, నడి వయస్కులు వ్యాక్సిన్ కోసం తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇంతటి డిమాండ్ను తట్టుకునే స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయా? కంపెనీలు సరఫరా చేయగలవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
11 రోజుల వ్యవధి ఉన్నా జాగ్రత్తపడలేదు
కేంద్రం ఏప్రిల్ 19న వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలను ప్రకటించింది. అప్పటివరకూ 45 ఏండ్లు నిండినవారే కరోనా టీకా తీసుకోవటానికి అర్హులుకాగా.. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హుల వయస్సును 45 నుంచి 18 ఏండ్లకు తగ్గించింది. అంతేకాదు, వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి టీకాలను స్వయంగా కొనుగోలు చేసుకోవటానికి రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు దవాఖానలకు అనుమతించింది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 28 నుంచి కొత్త లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 19 నుంచి మే 1 వరకూ 11 రోజుల గడువున్నా.. కేంద్రం ఇటు రాష్ర్టాలను, అటు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలను సమన్వయం చేసుకొని, ప్రణాళికలను సిద్ధం చేసుకోలేదు. దానిపై గట్టిగా కసరత్తు పెట్టి ఉంటే.. కొత్తగా టీకాల కోసం నమోదు చేసుకునేవారికి నిరాశ పరిస్థితులు ఎదురయ్యేవి కావు. ఇకనైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కడికక్కడ సమన్వయంతో టీకాల పంపిణీ, సరఫరా, వ్యాక్సినేషన్పై పని చేసి, పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే విస్తృత వ్యాక్సినేషన్ సాధ్యమతుందని నిపుణులు సూచిస్తున్నారు.
18-44 ఏండ్లవారికి ప్రైవేటులోనే టీకా!
ఏప్రిల్ 23న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ర్టాలకు రాసిన లేఖ ప్రకారం.. 18-44 ఏండ్లలోపు వాళ్లు ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి టీకాలు తీసుకోవచ్చు. వీళ్లు ప్రభుత్వ దవాఖానల్లో లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు తీసుకోవటం అనేది ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రస్తుతం 45 ఏండ్లు నిండినవారికి ఉచితంగా టీకాలు వేస్తున్నారు కాబట్టి.. ఇదే ప్రయోజనాన్ని (ఉచితంగా టీకా వేయటాన్ని) 18-44 ఏండ్ల వారికి కూడా కల్పించాలనుకుంటే.. సంబంధిత ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు.