చేర్యాల, మే 26: పల్లె ప్రగతి కార్యక్రమంతో చిట్యాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న పనులతో ఇటు అభివృద్ధితో పాటు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డుతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, అంతర్గత సీసీ రోడ్లు వేయడంతో గ్రామం అభివృద్ధి చెందుతున్నది. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. దీంతో వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వాటర్ ట్యాంకర్ ద్వారా హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. ఎస్సీవాడల్లో సీసీరోడ్లు వేయడంతో వీధులు పరిశుభ్రంగా మారిపోయాయి. 40 ఏండ్లుగా సైకిల్ వెళ్లలేని దారిలో 12 ఫీట్ల సీసీ రోడ్డు వేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 52 పాత ఇండ్లను తొలిగించారు. గ్రామంలో కొత్తగా 12 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రమాదకరంగా మారిన మూడు ఇనుప స్తంభాలను తొలిగించారు.
ప్రకృతి వనంతో గ్రామానికి కొత్తందం
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఊరికే కొత్తందం తెచ్చింది. సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్రావు, ఉప సర్పంచ్ లత, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచనాశ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుకెళ్తున్నారు.ప్రకృతి వనంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు.
రోడ్డుకు ఇరువైపులా చెట్లు..
గ్రామంలో రోడ్డు ఇరువైపులా పెరిగిన చెట్లు పాఠశాల ఆవరణ, ప్రధాన కూడళ్లతోపాటు గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఇప్పుడు అవి ఏపుగా పెరిగాయి. బాటసారులతో పాటు అటు వైపుగా వెళ్తున్న వారికి ఇంపుగా కనిపిస్తున్నాయి. అలాగే, గ్రామ పాఠశాలకు పల్లెప్రగతి నిధులతో రంగులు సైతం వేయడంతో అందంగా కనిపిస్తున్నది. రైతువేదిక నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ
గ్రామ పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక బాత్ రూం నిర్మించారు. ఏండ్లుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్న ఎస్సీ, ముదిరాజ్ కాలనీలకు తాగునీటి పైపులైన్ల వేశారు.
మరింత అభివృద్ధి చేసుకుంటాం
ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తు న్నాం. గతంలో అనేక సమ్యలు ఉండేవి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లెప్రగతితో గ్రామానికి అన్ని సౌకర్యాలు వచ్చాయి. వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అం డర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మాణాలు పూర్తి చేశాం.
ఎర్రవెల్లి రామ్మోహన్రావు, సర్పంచ్, చిట్యాల
గ్రామాభివృద్ధికి సహకారం
పల్లెప్రగతిలో గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నది. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సర్పంచ్, పాలకవర్గానికి సహకా రం అందిస్తున్నాం. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమ స్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
-మిట్టపల్లి సులోచనాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ