బెంగాల్లో 80%, అస్సాంలో 77% పోలింగ్
పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు
అస్సాంలో ప్రశాంతం
కోల్కతా, మార్చి 27: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి అంకం ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడుతలో భాగంగా పశ్చిమబెంగాల్లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్లో 79.79 శాతం, అస్సాంలో 76.89 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచారు.
బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు
హోరాహోరీ పోరు నెలకొన్న బెంగాల్లో పలు చోట్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏ పార్టీకి ఓటువేసినా ఒకే పార్టీకి వెళ్తున్నదని మజ్నాలో పోలింగ్ బూత్ వెలుపల ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను అక్కడికి పంపినట్టు ఈసీ అధికారులు తెలిపారు. వీవీప్యాట్ మెషీన్లను కూడా మార్చినట్టు చెప్పారు. తృణమూల్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని సువేంధు అధికారి సోదరుడు సౌమేంధు ఆరోపించారు. డాంటన్ నియోజకవర్గంలోని మోహన్పూర్లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. కేశియారిలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ విగతజీవుడై కనిపించారు. ఇది తృణమూల్ పనేనని బీజేపీ ఆరోపించగా, తృణమూల్ దీనిని ఖండించింది. సోరెన్ మృతికి, ఎన్నికలకు సంబంధం లేదని జిల్లా యంత్రాంగం ఈసీకి నివేదికిచ్చింది. 2016 ఎన్నికల్లో ఈ 30 స్థానాల్లో 27 నియోజకవర్గాలను తృణమూలే కైవసం చేసుకుంది.
అస్సాంలో ప్రశాంతం
అస్సాంలో తొలి విడుత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సీఎం శర్బానందతోపాటు పలువురు మంత్రులు, విపక్షాల ముఖ్యనేతలు ఈ విడుతలోనే బరిలో ఉన్నారు. బీజేపీ-ఏజీపీ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి, అస్సాం జతియా పరిషద్ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది.