తెలుగు చిత్రసీమలో కొందరు నాయికల ప్రభ వెలిగిపోతోంది. అందం, అభినయానికి తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కథానాయికల డేట్స్ కోసం దర్శనిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండేళ్ల వరకు తమ క్యాలెండర్ ఖాళీగా లేదని చెబుతున్నారీ ముద్దుగుమ్మలు. యువతలో తిరుగులేని ఫాలోయింగ్, సక్సెస్ సెంటిమెంట్ వెరసి ఈ భామలు తారాపథంలో దూసుకుపోతున్నారు.
గత కొంతకాలంగా దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. ప్రస్తుతం అయిదు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. రష్మిక దూకుడు చూస్తుంటే మరో రెండు, మూడేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవనే సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న ‘పుష్ప’తో పాటు శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్బై’తో మరో చిత్రాన్ని అంగీకరించిందీ సుందరి.
చిత్రసీమలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లయినా కాజల్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగార్జునతో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తోందామె. తమిళంలో నాలుగు సినిమాల్ని ఒప్పుకుంది. తమన్నా సైతం నూతన నాయికలకు గట్టిపోటీనే ఇస్తోంది. తెలుగులో సీటీమార్, గుర్తుందా శీతాకాలం, మాస్ట్రో, ఎఫ్-3 సినిమాలు చేస్తోంది. మరోవైపు వెబ్సిరీస్లపై దృష్టిసారిస్తోంది.
తెలుగులో అగ్రహీరోల సినిమా ప్రకటన వెలువడటమే ఆలస్యం అందులో కథానాయికగా తొలుత వినిపించే పేరు పూజాహెగ్డేదే అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లక్కీఛార్మ్గా ఈ సొగసరి మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఆమె డైరీ నిండిపోయింది. టాలీవుడ్లో ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ‘ఆచార్య’సినిమాల్లో నటిస్తుంది. అలాగే మహేష్బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న తాజా సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే పేరు ప్రచారంలో ఉంది. మరోవైపు అగ్రహీరో విజయ్ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత తమిళంలో పునరాగమనం చేయబోతుంది. బాలీవుడ్లో చక్కటి స్టార్డమ్ను సొంతం చేసుకున్న ఈ సొగసరి సర్కస్, కభీ ఈద్ కభీ కభీ దివాలీ సినిమాలపై సంతకం చేసింది.
‘ఉప్పెన’ సినిమాలో చక్కటి అభినయం,రూపలావణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మ డు టాలీవుడ్లో బిజీగా మారింది. నాని ‘శ్యామ్సింగరాయ్’తో పాటు సుధీర్బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. లింగుస్వామి దర్శక త్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం కోసం రామ్తో జోడీకట్ట బోతున్నది. తమిళంలో ధనుష్తో ఆమె ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కెరీర్ ఆరంభం నుంచి సినిమాల ఎంపికలో నిదానంగా అడుగులు వేస్తూ వచ్చిన రాశీఖన్నా ఏడాది కాలంగా వేగం పెంచుతోంది. తెలుగులో ‘థాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తోన్న ఆమె తమిళంలో నాలుగు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. మలయాళంలో ‘అంధాధూన్’ రీమేక్లో నటిస్తోంది. హిందీలో వెబ్సిరీస్కు పచ్చజెండా ఊపింది.