న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం బీజేపీ తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పార్టీ కష్టకాలంలో తనను ఆదుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, కానీ ఆ ఆశలు ఆడియాశలు అయ్యాయని చిరాగ్ వ్యాఖ్యానించారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మౌనం తనను కచ్చితంగా బాధిస్తుందని చెప్పారు.
తన తండ్రి రామ్విలాస్ పాశ్వాన్, తాను బీజేపీకి అండగా నిలిచామని చిరాగ్ గుర్తుచేశారు. అయితే తాను ఇబ్బందుల్లో ఉన్నపుడు బీజేపీ తనకు మద్దతుగా నిలవలేదని వాపోయారు. ఇక బీజేపీతో ఏకపక్షంగా సంబంధాలు కొనసాగించడం సాధ్యం కాదన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో పార్టీ అన్ని అవకాశాలను పరిశీలిస్తుందని చెప్పారు.
ఎల్జేపీలో చీలిక వచ్చేలా జేడీయూ పనిచేసినా బీజేపీ మౌనం దాల్చడం సరి కాదన్నారు. అయితే బీజేపీ మాత్రం ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చెబుతున్నది. కాగా, ఓ దళిత నేత ఎదిగి, ఉన్నత స్థానానికి చేరుకోవడం నితీశ్ కుమార్కు ఇష్టం లేదని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ను బలహీనపరచడానికి కూడా నితీశ్ అనేక ప్రయత్నాలు చేశారని చెప్పారు.