కరీంనగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అత్మగౌరవం అనేది ఉంటే, నిజాయితీ పరుడివే అయితే.. మాటకు కట్టుబడి ఉంటే.. ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడు అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్.. ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. అసైన్డ్ భూముల విషయలో ఇప్పటికే అధికారులు ఆయనను దోషిగా తేల్చారని, ఏమాత్రం సిగ్గు ఉన్నా సదరు భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్చేశారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఏ ఒక్క ఆరోపణను నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధమని, అదే సమయంలో స్వయంగా ఈటలనే అసైన్డ్ భూములు కొన్న మాట నిజమేనని ఒప్పుకున్న తదుపరి బర్తరఫ్ చేసినా ఇంకా పార్టీని, పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్చేశారు. ఈటల మంగళవారం హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంతోపాటు వ్యక్తిగతంగా గంగులపై ఆరోపణలు చేయడంతో మంత్రి కరీంనగర్లోని మీసేవా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. సీనియర్గా, టీఆర్ఎస్లో ఉన్న వ్యక్తిగా రాజేందర్కు ఇన్నాళ్లూ గౌరవం ఇచ్చామని, కానీ, ఆయన మాత్రం ‘బిడ్డా..? ఖబడ్దార్’ అంటూ తనకు వ్యక్తిగతంగా హెచ్చరికలు జారీచేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగారని పేర్కొన్నారు. రాజేందర్లో ప్రస్టేషన్ కనిపిస్తున్నదని, తప్పు చేశాననే భావన ఆయన మాటల్లో ప్రస్పుటంగా అగుపిస్తున్నదని, అందుకే అదుపు తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
గ్రానైట్ క్వారీలతో బొందల గడ్డ చేస్తున్నారని, గ్రానైట్ పన్ను ఎగవేసిన వివరాలన్నీ బయట పెడుతామంటూ ఈటల చేసిన విమర్శలపై మంత్రి గంగుల ఘాటుగా స్పందించారు. కరీంనగర్ జిల్లాలో 350 క్వారీలుంటే.. అందులో గంగులది ఒక క్వారీ మాత్రమేనని స్పష్టంచేశారు. 2004 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల.. నాడు కమలాపూర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో తమిళనాడుకు చెందిన వాళ్లు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు నడుపుతున్నారని, ఇప్పుడు ఇంకా అనేక క్వారీలు ఆ పరిధిలో నడుస్తున్నాయని, ఆ క్వారీలను ఎందుకు ఆపలేదో చెప్పాలని నిలదీశారు. గ్రానైట్ టాక్సులు ఎగవేశారన్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. నిరూపిస్తే అందుకు ఐదింతలు చెల్లిస్తానని సవాల్ విసిరారు. 2004లో ఎమ్మెస్సార్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కలిసి దేవరయాంజాల్ భూములను క్రమబద్ధీకరించాలని కోరింది వాస్తవం కాదా? అని, అది అక్రమమని ఎమ్మెస్సార్ నిరాకరించింది నిజం కాదా? అని, దీనికి ప్రత్యక్ష సాక్షిగా ప్రస్తుత కరీంనగర్ మేయర్ సునీల్రావు ఉన్నది నిజంకాదా? అని, వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. నాగార్జునసాగర్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచారంటూ ఈటల చేసిన విమర్శలను మంత్రి గంగుల ఖండించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, గ్రంథాలయ చైర్మన్ రవీందర్రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు అనందరావు, శ్యాంసుందర్రెడ్డి, నాయకులు హరిశంకర్, పురమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.