మెదక్ మున్సిపాలిటీ /అందోల్, జూన్ 7: నేటి నుంచి మృగశిరకార్తె ప్రారంభం కానుండడంతో రైతులు పొలం పనులను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మృగశిరను పంటల సాగుకు శుభసుచకంగా భావించి రైతులు పండుగ జరుపుకోవడం అనాధిగా వస్తున్న ఆచారం. రోహిణికార్తెలో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఎంతో ఉపశమనం లభిస్తుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి సాలు అని అర్థ్ధం. ఈ కాలంలో తొలకరిజల్లులు పడగానే పొల్లాలో దుక్కులు దున్ని పంటలు వేయడం మొదలు పెడుతారు రైతులు. ఈ ఏడాది మృగశిరకు ముందే తొలకరిజల్లుల కురువడంతో రైతన్నలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. హేమంత రుతువులో వచ్చే మొదటినెల కావడంతో దీన్ని అనుసరించి సౌరమానం ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిరమాసమని అంటారు. మృగశిరకార్తె ప్రవేశాన్ని వార్షాకాలనికి సూచనగా భావిస్తూ రైతులు కొత్తపంటల సాగును ప్రారంభిస్తారు.
మృగశిరకార్తె నిర్వహించుకునే విధానం, ఆచారాలు
మృగశిరకార్తె మొదటి రోజును పలు ప్రాంతాల్లో పలు రకాలుగా జరుపుకొంటారు. మృగశిర, మృగం, మిర్గం, మిరుగు పేర్లతో మృగశిర కార్తె రాకను పండుగ నిర్వహించుకొని దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పిస్తారు. మృగశిర రోజున బెల్లంతో ఇంగువను కలిపి తింటే ఇంగువ శరీరంలోని వేడిని అధికం చేసి వర్షాకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని ప్రజల నమ్మకం. అంతే కాకుంకా మృగశిర రోజున చేపలు, ఇతర మాంసాహారం తింటే ఎలాంటి వ్యాధులు సైతం దూరమవుతాయని ఇక్కడి ప్రజల్లో నమ్మకం కూడా ఉన్నది. మేక, కోడిమాసంతో పోల్చితే మృగశిర రోజున చేపలను తినడానికి ప్రజలు అమితాసక్తి చూపుతారు. దీంతో మృగశిర రోజున ఎక్కడ చూసినా చేపలకుండే డిమాండ్ అంతా.. ఇంతకాదు. ఉబ్బసం వాధిగ్రస్తులకు వర్షాకాలంలో కొంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించి ఉబ్బసం (అస్తమా) వ్యాధిగ్రస్తులకు మృగశిరకార్తె సందర్భంగా కొన్నేండ్లుగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందును పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సైతం ఇంగువతో పాటు చేప మందును సైతం పంపిణీ చేస్తుంటారు.
అసలు కార్తె అంటే ఏమిటి..
సూర్యడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజులు ఉంటాడు. ఇలా సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ కాలానికి (కార్తెకు) ఆ నక్షత్రం పేరు పెట్టడం జరిగింది. ఈ కార్తెలు సౌరమానం ప్రకారం గణించబడడంతో ఆంగ్ల(గ్రెగొరియన్)క్యాలెండర్ ప్రకారం దాదాపు ప్రతి ఏడాది ఒకే తేదీలో రావడం జరుగుతుంది.
మృగశిర కార్తె ప్రాముఖ్యత
మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది. దీనికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారని భావిస్తారు. పూర్వం వైశంపాయనుడు మృగశిరకార్తె రోజునే తన శిశ్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయినా వరుణదేవుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అటు పరమాత్మకు ఇటు లౌకిక వ్యవహారాలకు మధ్య మృగశిర కార్తెను సంధానకర్తగా భావిస్తారు. తొలకరిజల్లుల సమయంలో భూమిపై నుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లులు అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమాళాన్ని తానే అని వివరిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండి మానవుని తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికమవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్తం చేసినట్లు ప్రచూర్యంలో ఉంది.
చేపలకు భలే గిరాకీ..
మద్దూరు, జూన్ 7: నేడు మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని అనాధిగా ప్రజలు భావిస్తున్నారు. దీంతో చేపలను కొనేందుకు ప్రజలు ఆసక్తిని కనబర్చుతారు. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్లలో చేపలను కొనేందుకు జనం ఎగబడ్డారు. కొన్ని గ్రామాల్లో మత్స్యకారులు చెరువు, కుంటలల్లో పెద్ద ఎత్తున చేపలను పట్టి గ్రామాల్లో విక్రయించారు. దీంతో చేపలకు మార్కెట్లో గిరాకీ లభించింది. ప్రధానంగా బొమ్మలు కిలో రూ. 600కు పైగా ధర పలికింది. మిగతా బొచ్చె, రవ్వులు తదితర చేపలు కిలోకు రూ. 300కు పైగా ధర పలికింది. వివిధ గ్రామాల్లో చేపల విక్రయాలతో మార్కెట్లు కిటకిటలాడాయి.