ముంబై, జూన్ 15: దేశంలో ఆర్థిక సంపద గతేడాది 11 శాతం ఎగిసి 3.4 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.250 లక్షల కోట్లు)ను తాకింది. కరోనా వైరస్ విజృంభణలోనూ భారత్.. సంపద సృష్టిలో దూకుడు కనబర్చిందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ పేర్కొన్నది. మంగళవారం విడుదలైన బీసీజీ నివేదిక ప్రకారం 2020 ఆరంభంలో మహమ్మారి ప్రభావం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థపై పడినా.. ఏప్రిల్ నుంచి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ముఖ్యంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్లు గణనీయంగా పుంజుకున్నాయన్నది. వ్యక్తులు లేదా పౌరుల భూములు, భవనాలు తదితర రియల్ ఆస్తు లు, రుణ బకాయిలు కానిదే ఈ ఆర్థిక సంపద అని బీసీజీ ఈ సందర్భంగా నిర్వచించింది.
రాబోయే కొన్నేండ్లూ దేశ ఆర్థిక సంపద వేగంగా పెరుగుతుందని బీసీజీ అభిప్రాయపడింది. అయితే వార్షిక వృద్ధిరేటు స్వల్పంగా తగ్గి 10 శాతంగా ఉండవచ్చన్నది. అయినప్పటికీ మొత్తం సంపద 2025కల్లా 5.5 లక్షల కోట్ల డాలర్లను తాకుతుందని అంచనా వేసింది. 100 మిలియన్ డాలర్లకుపైగా సం పద ఉన్న వ్యక్తులు మరింత పెరుగవచ్చని చెప్పింది. వచ్చే ఐదేండ్లలో వీరి సంఖ్య రెట్టింపై 1,400లుగా నమోదు కావచ్చని పేర్కొన్నది.
రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నాన్-మానిటరీ గోల్డ్, ఇతర విలువైన లోహాల ఆస్తులు నిరుడు 12.4 లక్షల కోట్ల డాలర్లను తాకాయి. 2019తో పోల్చితే 14 శాతానికిపైగా ఎగిశాయి. ఈ క్రమంలోనే 2025 నాటికి వీటి విలువ 8.2 శాతం ఎగబాకి 18.5 లక్షల కోట్ల డాలర్లను చేరవచ్చని బీసీజీ అంచనా వేసింది. కరెన్సీ, డిపాజిట్లు, ఈక్విటీలు, జీవిత బీమా తదితరాలన్నీ ఆర్థిక సంపద వృద్ధికి దోహదం చేస్తున్నాయి.