ప్రతివారం మాదిరే ఈ వారం కూడా మూడు సినిమాలు వచ్చాయి. దానికి ముందు నాలుగైదు సినిమాలు వచ్చేవి. ఈ సారి మాత్రం మూడు వచ్చాయి. టాలీవుడ్లో కొన్ని వారాలుగా ఒక్క సినిమాకైనా పాజిటివ్ టాక్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కూడా జరగలేదు. ఈ వారం మూడు సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కదానికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. దాంతో బయ్యర్లకు ఈ సారి చుక్కలు తప్పేలా లేవు.
మంచి అంచనాలతో వచ్చిన చావు కబురు చల్లగా సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో విషయం తక్కువ.. వేదాంతం ఎక్కువైపోయిందంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. కార్తికేయ బాగానే చేసినా కూడా కథనం వీక్ కావడంతో చావు కబురు చల్లగా వెచ్చగా అయిపోయేలా కనిపిస్తుంది.
మరోవైపు మంచు విష్ణు మోసగాళ్లు కూడా డిజాస్టర్ టాక్తోనే ఓపెన్ అయింది.హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా తొలిరోజు దారుణంగా నిరాశ పరిచింది. కేవలం 42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.
ఇదిలా ఉంటే ఆది సాయికుమార్ నటించిన శశి సినిమా గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. చాలా ఏళ్లుగా వరస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి శశి కూడా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తరహా రేంజ్లో కథ అనుకున్నా స్క్రీన్ ప్లే లోపాలతో రిజల్ట్ దారుణంగా వచ్చింది.
దాంతో ఈ ఫ్రైడే పూర్తిగా డీప్ ఫ్రై అయిపోయింది. ఒక్క సినిమా కూడా నామమాత్రపు వసూళ్లు కూడా తీసుకురాలేదు. దాంతో వచ్చే వారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది.