ముంబై: మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ దుర్మరణం పాలయ్యారు. రాయ్గడ్ జిల్లాలోని రోహా-కోలాడ్ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. అనంత కదమ్ (49), మనీషా కదమ్ (47) తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత కాసేపటికే వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనంత కదమ్ దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా వారి ఇద్దరు పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆటో డ్రైవర్ గణేశ్ ఖడే నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అతనిపై కేస్ బుక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.