సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. లాక్డౌన్ వల్ల హైదరాబాద్ జిల్లాలో బీపీఎల్ పరిధిలో ఉన్న తెల్లకార్డు దారులకు ఉపాధి పూర్తిగా కరువైంది. దీంతో ప్రభుత్వం జిల్లా పరిధిలోని దాదాపు 5.80 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని దాదాపు 670 రేషన్ డీలర్ల ద్వారా 3.33 కోట్ల బియ్యాన్ని తెల్ల రేషన్కార్డు దారులకు పంపిణీ చేయనున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభించనున్నారు.. ఈ పంపిణీ 15 వరకు కొనసాగనుంది. గత నెలలో 5.22 లక్షల తెల్ల కార్డు దారులకు రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రమేశ్ తెలిపారు.
ఇందులో ఐరీస్ ద్వారా 3,18,169 మంది, ఓటీపీ విధానం ద్వారా 2,06,108 తెల్ల కార్డు దారులు రేషన్ పొందారన్నారు. వీరందరూ 1.24 కోట్ల కిలోల బియ్యాన్ని పొందారు. అయితే జూన్లో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ కోటా పెరిగింది. శనివారం నుంచి జిల్లాలోని తెల్లకార్డు దారులకు మనిషికి ఒక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బాలమాయాదేవి ప్రకటించారు. ఈ అవకాశాన్ని కార్డు దారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రేషన్ షాపుల వద్ద ఉచిత బియ్యాన్ని పొందాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు స్కూల్ టీచర్లు, ఇతర సిబ్బంది.. మొత్తం 32,709 మందిని గుర్తించారు. వారిలో మే నెలలో 28,851 మంది ప్రైవేటు స్కూల్ సిబ్బంది రేషన్ ద్వారా లబ్ధి పొందారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికీ 25 కిలోల చొప్పన సన్నబియ్యాన్ని సివిల్ సఫ్లయ్శాఖ అధికారులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 670 రేషన్ షాపుల నుంచి స్కూల్ టీచర్లకు బియ్యం పంపిణీ చేశామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.