తొర్రూరు, గార్ల ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుకు కసరత్తు
వారం రోజుల్లో పనుల పూర్తికి కలెక్టర్ గౌతమ్ సమీక్ష
తొర్రూరు, మే 1: కరోనా రెండో దశలో జిల్లాలో వేగవంతంగా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వీపీ గౌతమ్ నేతృత్వంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణను తీసుకుంటున్నారు. వారం రోజుల్లో 60 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేసేలా కలెక్టర్ గౌతమ్ రెండు రోజులుగా సమీక్షలు చేస్తూ ప్రభుత్వ దవఖానలను సందర్శిస్తున్నారు. తొర్రూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30, గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 కలిపి మొత్తం 60 ఆక్సిజన్ పడకలను నూతనంగా ఏర్పాటు చేసి కొవిడ్ బారిన పడిన వారికి చికిత్సలు నిర్వహించేలా కార్యచరణను మొదలు పెట్టారు.
వారం రోజుల్లో ఈ రెండు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన బెడ్లు సిద్ధ్దంగా ఉండేలా తక్షణం పనులు మొదలు పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖలో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించి ఈ రెండు ప్రభుత్వ ఆసుపత్రులను నేరుగా పర్యవేక్షించి సౌకర్యాలపై వైద్యులతో కలిసి చర్చించారు. కరోనా పాజిటివ్గా తేలి కొంత మంది వ్యక్తులు శ్వాసకోశ సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుండగా, నిరుపేద వర్గాలకు చెందిన వారు కార్పొరేట్ వైద్యం పొందాలంటే దిక్కుతోచక ప్రభుత్వ దవాఖాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. రెండో దశ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారు ఆక్సిజన్ దొరకక తనువు చాలిస్తున్నారు. మ న రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆక్సిజన్ కొరత తలెత్తకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా కొవిడ్ చికిత్సల కోసం వార్డులను ఏర్పాటు చేసి ఆక్సిజన్తో కూడిన బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు.
ప్రత్యేక సిబ్బంది నియామకం..
తొర్రూరు, గార్ల ప్రభుత్వ దవాఖానల్లో వారం రోజుల్లో కొవిడ్ చికిత్సలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం, జిల్లా కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజేశ్ కలెక్టర్ వెంట ఉండి ప్రత్యేక వైద్య సిబ్బంది తాత్కాలిక నియామకం కోసం యోచన చేశారు. ఈ రెండు పీహెచ్సీల్లో కొవిడ్ చికిత్సల కోసం ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ను సర్దుబాటు చేసి షిప్ట్ల వారీగా పని చేసేందుకు ఐదుగురు స్టాఫ్ నర్సులను తాత్కాలిక విధులు నిర్వర్తించేలా నియమించుకోనున్నారు. ఈ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల కోసం ఆక్సిజన్, బెడ్స్ వంటి సౌకర్యాలను ప్రభుత్వ నిధులతో స మకూర్చి, స్టాఫ్ నర్సులను, వైద్య సేవలు అందించే డాక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించి మూడు నుంచి ఐదు నెలల పాటు వీరికి వేతనం అందించేందుకు స్థానిక దాతల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ దిశగా అధికారులు కార్యచరణ మొదలు పెట్టారు.
పెరుగనున్న ఐసీయూ బెడ్స్..
ప్రస్తుతం జిల్లాలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో 32, గుడూరు సీహెచ్సీలో 20 కలిపి 52 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో త్వరలో నే అదనంగా 40 పడకల కొవిడ్ వార్డును ఏర్పా టు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వెంటిలేటర్ అవసరం ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించేందుకు ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న రెండు ఐసీయూ బెడ్స్కు అదనంగా 12 బెడ్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సౌకర్యాలు పేదరికంలో ఉన్న రోగులకు ఎంతో సహకారం కానున్నాయి. ఆక్సిజన్ కొరత లేకుండా రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.