‘తెలుగు సినిమాలో ఇప్పటివరకు రానటువంటి సరికొత్త ప్రయోగమిది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఓ మంచి సినిమా చూశామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు’ అని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన టైటిల్ పాత్రలో శ్రీవిష్ణు, లవ్లీసింగ్ జంటగా నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకుడు. ఎస్.కృష్ణ నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల కథ ఇది. షూటింగ్ సమయంలోనే గొప్ప సినిమా అవుతుందనిపించింది. నా కెరీర్లోనే సరికొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు. ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు మైమ్ అభినయంలో గోల్డ్మెడల్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ దుస్తులు ధరించి స్టేజ్ మీదకు రావడానికి మైమ్ మధునే కారణం’ అన్నారు. ‘రాజేంద్రప్రసాద్గారి నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మైమ్ సన్నివేశాలకు ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు. ఈ వయసులో కూడా పాత్ర కోసం ఏమైనా చేయగలనని ఆయన నిరూపించారు’ అని శ్రీవిష్ణు చెప్పారు. నిర్మాత ఎస్.కృష్ణ మాట్లాడుతూ ‘కొన్ని సీన్లలో కన్నీళ్లొచ్చాయని చాలా మంది నాతో చెప్పారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రాజేంద్రప్రసాద్తో పాటు మా టీమ్కు దక్కుతుంది’ అని తెలిపారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్గారికి ట్రాన్స్లేటర్గా తన పాత్రకు మంచి పేరొచ్చిందని హాస్య నటుడు సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.