మహబూబ్నగర్/దేవరకద్ర : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు.
దేవరకద్ర పశువుల సంతకు ప్రఖ్యాతిగాంచిందని.. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పశువులను ఈ సంతకు తీసుకువస్తారని కలెక్టర్ తెలిపారు. అయితే పశువుల అమ్మకం, కొనుగోలు సందర్భంగా గ్రామ పంచాయతీ ద్వారా వసూలు చేసే ఫీజు విషయంలో గ్రామపంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు.. ముఖ్యంగా సర్పంచ్ కుమారుడు నకిలీ రశీదు పుస్తకాలను తయారుచేసి ఫీజు వసూలు చేస్తుండగా అదనపు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.
సర్పంచ్ కుమారుని వాహనంలో నకిలీ రశీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై గతంలోనే పోలీస్ కేసు కూడా నమోదైందని ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై గ్రామపంచాయతీ సర్పంచ్ కొండా విజయమ్మ, పూర్వపు ఎంపీవో ప్రస్తుత ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వనితలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయగా… వారి నుంచి సరైన సమాధానం రానందున ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ విషయంపై తుది విచారణకు ఆదేశించామన్నారు. పోలీసుల తరఫున సైతం విచారణ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండి కొట్టడమే కాకుండా.. గ్రామపంచాయతీ చట్టానికి వ్యతిరేకంగా పని చేయటం, అక్రమాలకు పాల్పడిన కారణంగా ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.